మిచౌంగ్తో స్తంభించిన జనజీవనం
ABN, First Publish Date - 2023-12-05T23:02:39+05:30
: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దేపూరు వద్ద బొగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తోం
అంధకారంలో గ్రామాలు
పొంగుతున్న వాగులు, వంకలు
లోతట్టు, పెన్నా పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
ఆత్మకూరు, డిసెంబరు 5: మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దేపూరు వద్ద బొగ్గేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.ఈదురు గాలులు, జోరు వానతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో అంధకారం నెలకుంది. రోడ్లు దెబ్బతిని పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి వర్షం తగ్గుముఖం పట్టణంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు, పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు చెరువు వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కరటంపాడు పునరావాస కేంద్రంలో బిస్కెట్లు, పండ్లు అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ కేతా వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ చైౖర్పర్సన్ జీ వెంకటరమణమ్మ, తదితరులు ఉన్నారు. ఇరిగేషన్ ఈఈ ఆర్ వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పలు చెరువులను, సప్లయ్ చానల్స్ను పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వరి నారుమళ్లు నీట మునిగాయి.
చుట్టుముట్టిన వర్షపునీరు
ఆత్మకూరులోని ఎస్టీ కాలనీని వర్షపునీరు చుట్టిముట్టింది. ఆర్డీవో మధులత, మున్సిపల్ కమిషనర్ బి నాగేశ్వరరావు, ఏఈ జూపల్లి ప్రసాద్ పరిశీలించి యుద్ధప్రాతిపదికన నీటిని పంట కాలువలోకి మళ్లించారు. ఆర్డీవో బండారుపల్లి పునరావాస కేంద్రంలో గిరిజనులకు భోజనం వడ్డించారు. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి, జాలయనగరం, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జి వెంకటరమణమ్మ, వైస్చైర్మన్ డాక్టర్ శ్రావణ్కుమార్ పరిశీలించి కూలిపోయిన చెట్లను తొటిగించి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుఫాన్ బాధితులకు సుమారు 400 మందికి సాంబశి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వరరెడ్డి భోజన వసతి కల్పించారు. బీఎస్ఆర్ సెంటర్ దర్గా వద్ద చెట్టు నేల కూలింది. వాసిలి ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం పడిపోయింది.
తాగునీటికి జనం అవస్థలు
సంగం : మండలంలో గాలివానకు పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి సరఫరాలేక ప్రజలు అల్లాడారు. భారీ వర్షానికి సంగం కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. మండలంలోని పెన్నా పరివాహక గ్రామాలు కోలగట్ల, అన్నారెడ్డిపాళెం, తరుణవాయి, వంగల్లు, మర్రిపాడు, సంగం తదితర లోతట్టు కాలనీలు, పూరి గుడిసెల్లో ఉన్న గిరిజనులను అధికారుల పునరావాస కేంద్రాలకు తరలించారు. నాట్లు వేసిన బీరాపేరు వెంబడి వరి పొలాలు, అన్నారెడ్డిపాళెం, మక్తాపురం తదితర గ్రామాల్లో నాట్లు నీట మునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా తరుణవాయిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆర్డీవో మధులత పరిశీలించారు.
ఉధృతంగా చవిటి వాగు
మండలంలోని చవిటి వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో చెన్నవరపాడు గ్రామానికి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెద్దలు ఒకరికొకరు చేతులు పట్టుకుని వాగు దాటారు. కానీ ఆడవారు, పిల్లలు బయటకు వెళ్లలేక గ్రామంలోనే ఉండి పోయారు. అలాగే బీరాపేరు, బొగ్గేరు గుండా వరద నీటి ప్రవాహం పెన్నానదిలో ప్రవాహించి సంగం బ్యారేజీకి వరద వచ్చింది. ఎగువ నుంచి సుమారు 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం బ్యారేజీకి చేరుతుంది. దీంతో మంగళవారం ఉదయానికి బ్యారేజి వద్ద 9.3 అడుగులున్న నీటి మట్టం 10.5 అడుగులకు పెరిగింది. దీంతో సెక్షన్ అధికారులు బ్యారేజీకి వస్తున్న నీటిని కనిగిరి ప్రధాన కాలువ ద్వారా కనిగిరి రిజర్వాయర్కు 1450 క్యూసెక్కుల, కావలి కాలువకు 250 క్యూసెక్కులు, దువ్వూరు కాలువకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించారు. కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ప్రవహించి చెరువులు జలకళ సంతరించుకున్నాయి. సంగం ఎర్రచెరువు, తలుపూరుపాడు, కొరిమెర్ల, చెన్నవరపాడు, జంగాలకండ్రిక, పెరమన, తదితర మైనర్ చెరవులతోపాటు దువ్వూరు, మర్రిపాడు మేజర్ చెరువులు సగం నిండాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన
అనంతసాగరం : మండలంలోని కొత్తపల్లి, కచ్చేరిదేవరాయపల్లి, రేవూరు, అనంతసాగరం ఎస్టీ కాలనీలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మంగళవారం సందర్శించి ముంపువాసులకు పరామర్శించారు. వారికి ఆహారం అందించడంతోపాటు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. శిథిలావస్థకు చేరిన రేవూరు బీసీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. కాగా మండలంలోని కొమ్మలేరు, కేతామన్నేరు, పల్లవోలు వాగులతోపాటు వంకలకు వరద పోటెత్తింది. దీంతో అనంతసాగరం, ఇనగలూరు, పడమటికంభపాడు, ఉప్పలపాడు చెరువులకు నీరు చేరింది. కొత్తపల్లి, ఉప్పలపాడు, పాతదేవరాయపల్లి, అనంతసాగరం పొలాలు వర్షపునీటితో చెరువులను తలపించాయి.
వీడని వర్షంతో ఇక్కట్లు
వరికుంటపాడు : వీడని వర్షంతో జలాశయాలతోపాటు వాగులు, వంకల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. కనియంపాడు-రామదేవులపాడు గ్రామాల సమీపంలోని పిల్లాపేరు వాగులోకి చేరిన వరదనీరు వంతెనపై ఉధృతంగా ప్రవహించింది. పోలీసులు అక్కడే ఉండి ప్రజలు అటువైపుగా వెళ్లకుండా కంప వేశారు. అలాగే జి.కొత్తపల్లిలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరడంతో పలు గ్రామాల్లోను విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తూర్పుబోయమడగలలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉండే ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరి కూలిపోయింది. వరికుంటపాడులో జాతీయ రహదారికి అడ్డుగా చెట్లు విరిగి పడ్డాయి. కాంచెరువులో కాలంచెల్లిన పాఠశాల గదులు దెబ్బతిని పడిపోయాయి. సెల్ఫోన్, ఇంటర్ నెట్ సిగ్నల్స్ సైతం మూగబోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
నీట మునిగిన పంటలు
మర్రిపాడు : మండలంలో కురిసిన భారీ వర్షానికి పొగాకు, మిరప, బొప్పాయి పంటలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. పడమటినాయుపల్లి వద్ద కేతామన్నేరు వాగు ప్రవాహం పెరగడంతో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. మండల కేంద్రంలోని గంగినేని వెంకటలక్ష్మమ్మకు చెందిన పొగాకు బ్యారన్ పడిపోయింది. అధికారులు మునక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు.
కరెంటు లేక అవస్థలు
ఏఎస్పేట : మండలంలోని గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగేందుకు కూడా మంచినీరు దొరక్క అవస్థలు పడ్డారు. వినాయక సెంటర్, చందులపాడు, చోట భీమవరం, తదితర గ్రామాలల్లో చెట్లు నేలకొరిగాయి.సెల్ చార్జింగ్, సిగ్నల్ లేక బంధువులకు సమాచారం ఇవ్వలేక దర్గాకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాడుగ రూములకు గిరాకీ పెరిగింది.
----------
Updated Date - 2023-12-05T23:02:41+05:30 IST