jagananna house జగనన్న ఇళ్ల నిర్మాణంలో అంతుపట్టని అవినీతి
ABN, First Publish Date - 2023-11-13T22:43:16+05:30
కావలిలో జగనన్న ఇళ్ల భూసేకరణ నుంచి నిర్మాణాల వరకు జరుగుతున్న అంతుపట్టని అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు.
కావలి, నవంబరు 13: కావలిలో జగనన్న ఇళ్ల భూసేకరణ నుంచి నిర్మాణాల వరకు జరుగుతున్న అంతుపట్టని అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. కావలి జర్నలిస్ట్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో విపక్షాలతో ఏర్పడిన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ కే.భాస్కర్, సభ్యులు చింతాల వెంకట్రావు, జ్యోతి బాబూరావు, పసుపలేటి పెంచలయ్య, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, పొబ్బా సాయివిఠల్లు మాట్లాడారు. పేదలపై ప్రేమతో జగన్న ఇళ్లు నిర్మించడం లేదని, అధికారులు, అధికారపార్టీ నేతలు దొరికనకాడికి దోచుకునేందుకే ఈ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఇళ్ల నిర్మాణానికి భూసేకరణతో మొదలైన అవినీతి లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలు, మెటీరియల్, నీటి సరఫరా కోసం వేసే పైపులైన్లు, క్యూరింగ్, ట్యాంకర్లతో నీటి సరఫరా.. ఇలా ప్రతిదానిలో అవినీతి జరుగుతోందన్నారు. కొద్ది పాటి వర్షానికే ఇళ్లు కూలిపోతున్నాయంటే వాటి నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇంత నాసిరకంగా నిర్మిస్తుంటే ఉన్నతాధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అవినీతి సొమ్ములో వారికి వాటా లేకుంటే ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. కావలి ఎమ్మెల్యేకు కూడా ఈ అవినీతిలో వాటా లేకపోతే ఇంత నాసిరకంగా నిర్మాణాలు జరుగుతున్నా ఆయన కాంట్రాక్టర్లు, అధికారులను ఎందుకు సమర్థిస్తున్నారన్నారు. నాణ్యతను తరచూ తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జగనన్న ఇళ్లలో అవినీతి లేదని చెప్పే ఎమ్మెల్యే ప్రతా్పకుమార్ రెడ్డి ఆ ఇళ్లలో వారం రోజులు నివాసం ఉండే దమ్ముందా అని సవాలు విసిరారు. ఈ సమావేశంలో కొప్పర్తి నాగరాజు, దమ్ము దర్గాబాబు, నారాయణ, సునీల్, వేణు, ఆజాం, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-13T22:43:18+05:30 IST