Errors voter lists : తవ్విన కొద్దీ తప్పులు!
ABN, First Publish Date - 2023-11-10T03:20:44+05:30
ఓటర్ల జాబితాల్లో తప్పులు తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్నాయి. చెట్లకూ ఓటు కల్పించిన ఘటనలు కొన్నయితే.. చనిపోయిన వారి పేర్లు జాబితాల్లో కొల్లలుగా ఉన్నాయి. ఒకే పేరు రెండు మూడు చోట్ల... పేర్లు, చిరునామాలు అన్నీ తప్పుల తడక. ఓటర్ల జాబితాల్లో
వచ్చిన పేర్లే మళ్లీ.. మళ్లీ
చనిపోయినా జాబితాలోనే..
ఒకరి ఫొటోలు.. మరొకరికి
బూత్ పరిధిలో లేకున్నా.. ఓట్లు అక్కడే
ఓటర్ల జాబితాల్లో చిత్రవిచిత్రాలెన్నో!
భీమవరం, నవంబరు 9: ఓటర్ల జాబితాల్లో తప్పులు తవ్వినకొద్దీ వెలుగు చూస్తున్నాయి. చెట్లకూ ఓటు కల్పించిన ఘటనలు కొన్నయితే.. చనిపోయిన వారి పేర్లు జాబితాల్లో కొల్లలుగా ఉన్నాయి. ఒకే పేరు రెండు మూడు చోట్ల... పేర్లు, చిరునామాలు అన్నీ తప్పుల తడక. ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న చిత్రవిచిత్రాలెన్నో!. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని లూథరన్ హైస్కూలులో ఉన్న 90వ పోలింగ్ బూత్లో 1300 ఓట్లకు పైగా ఉన్నాయి. ఓటర్ల జాబితాలో చాలా పేజీల్లో ఓటరు ఫొటో, చిరునామా పక్క.. పక్కనే మళ్లీ ప్రచురించారు. మొత్తం పదికిపైగా ఓట్లు, వారికి సంబంధించిన ఫొటోలు రిపీట్ అయ్యాయి. చనిపోయిన వారి ఓట్లు ఏడు తొలగించలేదు. వీటిని తొలగించాలని ఫిర్యాదు చేసినప్పటికీ యథావిధిగా ఉంచేశారని అంటున్నారు. పోలింగ్ బూత్ పరిధి వదిలి వెళ్లిపోయిన వారి ఓట్లు కూడా జాబితాలో ఉన్నాయి. అచ్చుతప్పులైతే లెక్కేలేదు. 21వ వార్డులో మధ్యతరగతి, సామాన్యులు ఉన్న 87వ పోలింగ్ బూత్లో ఓటర్ల జాబితాలను తనిఖీ చేసినప్పుడు ఎన్నో పొరపాట్లు కనిపించాయి. చనిపోయిన వారికి చెందిన 12 మంది ఓట్లు అలాగే ఉన్నాయి. గతంలో సర్వే చేసినప్పుడు ఈ పేర్లు తొలగించాలని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు ఆ వార్డు మాజీ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం చెప్పారు. చెప్పినా.. తిరిగి అవే పేర్లు రావడం దారుణమని అన్నారు. ఇదే వార్డులో పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయిన వారికి సంబంధించిన 20 ఓట్లు మళ్లీ ఇక్కడే ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సర్వే సమయంలోనే వారి దృష్టికి వచ్చాయి. అయినా సవరణ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఓటర్ల ఫొటోలు మారిపోవటం, చిరునామాలు తప్పుగా ప్రచురించడం తాజా పరిశీలనలో వెల్లడయ్యాయి. ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే.. బీఎల్వోల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
వలంటీర్కు మూడు ఓట్లు!
విశాఖపట్నం, నవంబరు 9: విశాఖపట్టణంలోని జీవీఎంసీ పదో వార్డు పాత డెయిరీ ఫారం సమీపంలోగల బీఎన్ఆర్ నగర్లో వలంటీర్గా పనిచేస్తున్న దుప్పాడ సాయిరామ్కు మూడుచోట్ల ఓటు ఉంది. టీడీపీ నాయకులు గురువారం బీఎన్ఆర్ నగర్లో ఓటర్ల జాబితాలు తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 70వ పోలింగ్ బూత్లో డోర్ నంబరు 5-622/48తో సీరియల్ నంబరు 875, 876, 881లో అతని పేరు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయమై కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి మాట్లాడుతూ వార్డులో చాలామంది పేర్లు డబుల్, త్రిబుల్ ఎంట్రీ అయ్యాయని చెప్పారు. వలంటీర్ సాయిరాం పేరు కూడా మూడుచోట్ల ఉందన్నారు. అధికారులు తక్షణమే తప్పులను సరిచేయాలని కోరారు.
ఓటు ఉందో.. లేదో తెలుసుకో..
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా-2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. https://voters. eci.gov.in వెబ్సైట్ హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ డీటెయిల్స్ హియర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్బై ఎపిక్ కార్డ్ నంబర్, సెర్చ్ బై మొబైల్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ వద్ద ఉన్న వివరాల ఆధారంగా అందులో ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్లో కూడా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే విభాగంలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
లేకపోతే వెంటనే ఫాం-6 దరఖాస్తు
ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకపోతే.. ఆలస్యం చేయకుండా ఫాం-6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేయాలి. మీ గ్రామంలోనే మీ ఏరియా పోలింగ్ బూత్ బీఎల్వో వద్ద ఫాం-6 దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి మండలంలోనూ తహశీల్దార్ లేదా డిప్యూటీ తాహశీల్దార్లు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారు. వారి కార్యాలయాల్లోనూ ఫాం-6 దరఖాస్తులు అందించవచ్చు.
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే..
https://voters.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్ చేసి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓటర్ హెల్ప్లైన్ మొబైల్ యాప్లోనూ ఇలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.
Updated Date - 2023-11-10T03:20:46+05:30 IST