భూ హక్కు చట్టం రద్దు చేయాల్సిందే
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:16 AM
భూ హక్కు చట్టం-2022 రద్దు కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల రిలే నిరసన దీక్షలు ఐదోరోజుకు చేరాయి. సోమవారం నిరసన దీక్షలో న్యాయవాదులు జన్ను శ్రీధర్, అల్లు కృష్ణకిషోర్, మువ్వల జయప్రకాష్, పి.రామకృష్ణ, డిఎ్సబి పవన్కుమార్, చందు రామకృష్ణ ప్రభు, పిట్టల గోవింద్లు పాల్గొన్నారు.
విజయవాడ లీగల్, డిసెంబరు 25 : భూ హక్కు చట్టం-2022 రద్దు కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల రిలే నిరసన దీక్షలు ఐదోరోజుకు చేరాయి. సోమవారం నిరసన దీక్షలో న్యాయవాదులు జన్ను శ్రీధర్, అల్లు కృష్ణకిషోర్, మువ్వల జయప్రకాష్, పి.రామకృష్ణ, డిఎ్సబి పవన్కుమార్, చందు రామకృష్ణ ప్రభు, పిట్టల గోవింద్లు పాల్గొన్నారు. న్యాయవాదుల దీక్షకు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ ఉపాధ్యక్షుడు పుప్పాల శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివా్సలు మాట్లాడుతూ, ఈ చట్టం ప్రజాసంక్షేమ వ్యతిరేక చట్టంగా అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు భూములపై హక్కు కోల్పోయే ప్రమాదముందన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రపంచ బ్యాంకు, కేంద్రం చేతిలో
కీలుబొమ్మగా రాష్ట్ర ప్రభుత్వం
- సుంకర రాజేంద్రప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్
ప్రపంచబ్యాంకు, కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తెచ్చింది. ప్రపంచబ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ర్టేషన్ విషయంలో దేశం 154వ స్థానంలో వుంది. అంతేకాక 66 శాతం సివిల్ కేసులు భూమికి సంబంధించి కోర్టుల్లో ఉన్నాయి. వీటి సత్వర పరిష్కారానికి చట్టం తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాక చట్టాలను అమలు చేసేవిషయంలో భారత్ 163వ స్థానంలో వుంది. సివిల్ కోర్టుల అధికారాలు తీసివేస్తే త్వరగా వ్యాపారం జరుగుతుందనే ఉద్దేశ్యంతో నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దేశవ్యాపిత ప్రతిపాదన ఇది. సివిల్ కేసులు సత్వర పరిష్కారం కావాలంటే ప్రస్తుతం వున్న కోర్టులను బలోపేతం చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది, ఇతర వసతులు, నిధులను ప్రభుత్వాలు కల్పించాలి. అంతేకాక న్యాయవ్యవస్థను పటిష్టపరిచే విధంగా న్యాయవాదుల వృత్తి, సంక్షేమం ఇతర వసతుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించకుండా కేసులు సత్వర పరిష్కారం ఆచరణ సాధ్యం కాదనేది వాస్తవం.
లాండ్ టైట్లింగ్ అధికారులకు అర్హత, న్యాయశాస్త్ర అవగాహన ఉండదు
- జన్ను శ్రీధర్, బెజవాడ బార్ ప్రధాన కార్యదర్శి
ఎటువంటి అర్హత, న్యాయశాస్త్ర అవగాహన లేని రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడే ల్యాండ్ టైట్లింగ్ అధికారులకు భూములు, ఆస్తులకు సంబంధించిన అంశాల నమోదు చేసే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. రిజిస్టర్లో ఒకసారి భూ హక్కుదారుని పేరు నమోదైన తర్వాత ఈ భూములపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం వుండదు. అభ్యంతరాలుంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి ట్రిబ్యునల్లో తేల్చుకోవాల్సి వుంటుంది. అక్కడ న్యాయం జరగలేదనుకుంటే తీర్పు వెలువడిన 15 రోజుల్లో రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్లో అప్పీలు చేయాల్సి వుంటుంది. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్లో, హైకోర్టులో భూమిహక్కును నిర్దారించుకోవచ్చని చట్టం చెబుతున్నా.. చిన్న, సన్నకారు, దళిత, బీసీ వర్గాల ప్రజలకు ఇది ఆచరణ సాధ్యం కాదు.
భూములు కబ్జాదారులకు
అప్పగించడమే చట్టం లక్ష్యం
- వి.గుర్నాధం, బెజవాడ బార్ మాజీ అధ్యక్షుడు
ప్రజల భూమి, ఇతర స్థిరాస్తి హక్కులను న్యాయవ్యవస్థ పరిధి నుంచి తొలగించి అధికార పార్టీ, రాజకీయ దళారీ, కబ్జాదారులకు అప్పగించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా కనబడుతోంది. ఎందుకంటే భూ యజమాని పేర్లను టైట్లింగ్ రిజిస్టర్లో నమోదు చేయడానికి ప్రతి మండలానికి జాయింట్ కలెక్టర్ స్థాయికి తగ్గని టైట్లింగ్ ఆఫీసర్ను రాష్ట్రస్థాయి ల్యాండ్ అథారిటీ నియమిస్తుంది. చైర్మన్, కమిషనర్తో పాటు ముగ్గురు సభ్యులుంటారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా వుండే ల్యాండ్ అథారిటీ నియమించే మండల టైట్లింగ్ ఆఫీసర్ ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వివిధ చట్టాల కింద రికార్డులను రూపొందించడం ద్వారా టైట్లింగ్ను నిరూపించడానికి తగిన మార్గాలున్నాయి.
అధికార పార్టీ చెప్పుచేతల్లోనే ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్లు
- పుప్పాల శ్రీనివాస్, బెజవాడ బార్ ఉపాధ్యక్షుడు
ల్యాండ్ టైట్లింగ్ చట్టం, 27/2023 వలన అదనపు రికార్డు సృష్టించడానికి దీని అధికారం కేవలం టైట్లింగ్ అధికారి చేతుల్లో వుంటుంది. తద్వారా గత రికార్డుల యొక్క సాక్ష్యంగా వున్న విలువలను రద్దు చేస్తుంది. ప్రస్తుతం వున్న డాక్యుమెంటరీ సాక్ష్యం, ఆర్ఎ్సఆర్, ఐఎ్ఫఆర్, ఎఫ్ఎల్ఆర్, 10(1), 1-ఎ, 1-బి, సెటిల్మెంట్ రికార్డు, ఎఫ్ఎంబి పనికిమాలిన వివాదాలను సృష్టించడానికి నిజమైన టైట్లింగ్ హోల్డర్లను హింసించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. అధికార పార్టీ చెప్పుచేతల్లోనే టైట్లింగ్ ఆఫీసర్లు వుంటారనేది వాస్తవం.
Updated Date - Dec 26 , 2023 | 12:17 AM