అరి‘కట్టలేరు’
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:51 AM
సిమెంట్ రోడ్ల పనుల కోసం ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుంటారు. ఆ పేరుతో రోజుల తరబడి ఇసుక తవ్వేస్తారు. దండిగా ఇసుకను డంప్ చేస్తారు. ఆనక ప్రైవేట్ కంపెనీలకు విక్రయించుకుంటారు. ఇదీ తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో సాగుతున్న ఇసుక దందా.
అధికార పార్టీ నేతల అక్రమాలు
సీసీ రోడ్ల పనుల కోసం అనుమతులు
ప్రైవేట్ కంపెనీలకు విక్రయాలు
రోడ్ల పేరుతో రోజుల తరబడి తవ్వకాలు
తిరువూరు ఆర్డీవోకు స్థానికుల ఫిర్యాదు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం కట్టలేరులో అధికార పార్టీ నాయకులు కొందరు అనధికారికంగా ఇసుకను తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు తరచూ స్పందన కార్యక్రమాల్లో ఫిర్యాదులు చేస్తుండటంతో ఇసుక దందాకు పాల్పడుతున్నవారు రూటు మార్చారు. తమ అక్రమ వ్యాపారంలో అధికారులను భాగస్వాములను చేస్తున్నారు. అనధికారిక తవ్వకాల ద్వారా ఫిర్యాదులను ఎదుర్కోవటం ఎందుకని.. అధికారికంగానే ఇసుక దందాకు తెరతీశారు. మండల పరిధిలో రోడ్ల నిర్మాణాల పేరుతో ఇసుక అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీనికి స్థానిక రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఒక రోడ్డు వేయటానికి కనిష్టంగా రెండు రోజులు, గరిష్టంగా వారం అనుమతి ఇస్తున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఒకరోడ్డుకు ఒక్కరోజు అనుమతి ఇవ్వడమే ఎక్కువ. అలాంటిది వారం రోజుల వరకూ అనుమతులు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ ప్రయోజనాల రీత్యా వేసే రోడ్లకైతే అనుమతులు ఇవ్వొచ్చేమో కానీ, టెండర్లు పిలిచిన రోడ్లకు కాంట్రాక్టర్లే ఇసుక సమకూర్చుకోవాలి. ఇందుకు భిన్నంగా కాంట్రాక్టర్లకు ఇసుక సరఫరా పేరుతో వైసీపీ నాయకులకు అనుమతులు ఇవ్వటంతో అవసరాలకు మించి ఇసుకను తోడేస్తున్నారు.
వీడియోలు తీసిన స్థానికులు
ఒక్కరోజు అనుమతి పేరుతో వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు. ప్రైవేట్ ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అసలు అనుమతి తీసుకున్న సిమెంట్ రోడ్ల పనులకు ఈ ఇసుక వెళ్లట్లేదు. నిల్వ చేసిన ఇసుకను ఆర్డర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు పంపుతున్నారు. నియోజకవర్గ పరిఽధిలోని ఒరలు, సిమెంట్ కిటికీలు తయారు చేసే పరిశ్రమలకు తరలిస్తున్నారు. స్థానికులు గుర్తించి ప్రశ్నిస్తే తమకు అనుమతులున్నాయని కాగితాలు చూపిస్తున్నారు. సిమెంట్ రోడ్ల కోసం ఇసుక సరఫరాకు అనుమతులు ఇవ్వటం చూసి స్థానికులు అసలేం జరుగుతుందో నిఘా పెట్టారు. ప్రైవేట్ ప్రాంతాల్లో డంప్ చేయడం, వాటిని సిమెంట్ కిటికీలు తయారు చేసే సంస్థలకు తరలించడాన్ని వీడియో తీశారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)కు ఆ వీడియో అందజేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా కట్టలేరులో సాగుతున్న ఈ ఇసుక అక్రమ దందాకు ముగింపు పలకాలని కోరారు. దీనిపై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. స్థానికులు గంపలగూడెం మండల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కట్టలేరు వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు.
Updated Date - Dec 24 , 2023 | 12:51 AM