జేపీ గారూ.. చర్చకు రండి
ABN, First Publish Date - 2023-03-31T03:32:33+05:30
ప్రభుత్వ ఉద్యోగులపై మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాశ్ నారాయణ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మీ వ్యాఖ్యలు ఉద్యోగులను అవమానించటమే
ఎవరో ఒత్తిడి తెచ్చి మాట్లాడించారు: ఏపీజేఏసీ అమరావతి
బెజవాడలో నేతల భేటీ.. జయప్రకాశ్ వ్యాఖ్యలపై చర్చ
ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారని ఆగ్రహం
విజయవాడ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులపై మాజీ ఐఏఎస్ అధికారి జయ ప్రకాశ్ నారాయణ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. గురువారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి అగ్రనేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, తదితరులు సమావేశ మై జేపీ వ్యాఖ్యలపై చర్చించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన జేపీ వీడియోను వీక్షించారు. జేపీ వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను సమర్థించటమే కాకుండా ఉద్యోగులకు పెన్షన్ అవసరమా అన్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. జేపీ వ్యాఖ్యల వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. జేపీ వ్యాఖ్యలను గట్టిగా ఖండించాలని లేకపోతే ప్రజలలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి జేపీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు. సమకాలీన అంశాలపై అవగాహన ఉన్న జేపీ వంటి వ్యక్తి పెయిడ్ ఆర్టి్స్టగా వ్యాఖ్యానించటం ఉద్యోగులను అవమానించటమేనని బొప్పరాజు అభిప్రాయపడ్డారు. పెన్షన్ భిక్ష కాదు.. హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందని, దాన్ని జేపీ వ్యతిరేకిస్తున్నారా అని వ్యాఖ్యానించారు. ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.2 లక్షలకు పైగా అలవెన్సులు ఉంటాయన్నారు. అఫిడవిట్లలో కోట్ల రూపాయల ఆస్థులు చూపేవారికి పెన్షన్లు ఎందుకని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన జేపీ జీతాలు తీసుకున్నారని, రిటైరైన తర్వాత పెన్షన్ కూడా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము సేవ చేయటం కోసమే కాదని భృతి కోసం కూడా పనిచేస్తున్నామన్నారు. పన్నులు కట్టేవారిలో ఉద్యోగులు ముందు వరసలో ఉంటారన్నారు. ఆయనపై ఎవరో ఒత్తిడి తెచ్చి మాట్లాడించారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆయన మాట్లాడి ఉంటే.. చర్చకు రావాల్సిందిగా సవాల్ చేద్దామని తెలిపారు.
జేపీ ఏమన్నారంటే... ఓ యూ ట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ ఉద్యోగుల అంశాలపై మాట్లాడారు. తనపై ఉద్యోగులు విరుచుకుపడతారని తెలిసినా, ద్వేషం ఏర్పడినా తాను ధైర్యంగా మాట్లాడతానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికీ లేనంత భద్రత ఉందని వ్యాఖ్యానించారు. మార్కెట్లో 20 వేల రూపాయలతో పనిచేసే వాడికి.. అదే పని ప్రభుత్వంలో చేస్తే రూ.80 వేలు వస్తుందన్నారు. మార్కెట్లో పనిచేసే వారికి పెన్షన్ ఇవ్వటం లేదన్నారు. పాత పెన్షన్ ఇవ్వకపోతే తమ తడాఖా చూపిస్తామంటూ ప్రభుత్వాలను బెదిరించే స్థాయికి చేరటాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాయని, బీఆర్ఎస్, వైసీపీ, తమిళనాడు పార్టీలు, బిజూ పట్నాయక్ పార్టీ, కేరళలోని వామపక్షాలు, బీజేపీ వంటివి నిలబడుతున్నాయని, వాటిని అభినందిస్తున్నానన్నారు.
Updated Date - 2023-03-31T03:32:33+05:30 IST