తహసీల్దార్ మాటలనూ పట్టించుకోండి
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:55 AM
మడకశిర తహసీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
సీఎ్సకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘మడకశిర తహసీల్దార్ ముర్షావలి అవినీతి అంశంపై మాట్లాడినందుకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. లంచం తీసుకున్న విషయంతో పాటు ఆయన లేవనెత్తిని అంశాలను దృష్టిలోకి తీసుకోవాలి’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రభుత్వంలో ప్రస్తుతమున్న పరిస్థితులను అద్దం పట్టేలా తహసీల్దార్ వ్యాఖ్యలున్నాయని, వ్యవస్థలు ఎంత నిర్వీర్యమయ్యాయో దానిని చూస్తే తెలుస్తుందన్నారు. తహసీల్దార్ వెల్లడించిన సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా సస్పెన్షన్తో సరిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే వ్యాధికి కాకుండా వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నట్లుందన్నారు. తహసీల్దార్ ముర్షావలి సస్పెన్షన్ను ఉపసంహరించుకుని సమస్య మూలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎ్సను ఆ లేఖలో కోరారు.
Updated Date - Dec 26 , 2023 | 02:55 AM