AP: అప్పుల ‘షాక్’!
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:58 AM
జగన్ సర్కారు వరుస తప్పిదాలతో రాష్ట్ర విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వ్యవస్థ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
విద్యుత్ సంస్థల రుణాలు 1.28 లక్షల కోట్లు
గత నాలుగున్నరేళ్లలోనే 71,910 కోట్లు
తెలంగాణలో విద్యుత్ సంస్థల అప్పుల భారం రూ.85 వేల కోట్లు. ఈ సంగతి బయటపడగానే... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వామ్మో అనుకున్నారు! మరి... ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల అప్పు ఎంతో తెలుసా? 1.28 లక్షల కోట్ల రూపాయలు.
కరెంటు కొనుగోళ్ల ఖర్చులు, ఇతర వ్యయాల భారాన్ని ఎప్పటికప్పుడు ‘ట్రూఅప్’ చార్జీల పేరుతో బాదుతూనే ఉన్నారు. సర్దుబాటు చార్జీలూ వాయిస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది సార్లు ఈ భారం మోపారు. నష్టాల భారాన్ని ప్రజలపై వేస్తున్నందున అప్పులు చేయాల్సిన అవసరం లేదు. అప్పులు చేస్తే ప్రజలపై చార్జీల భారం వేయరాదు! అయినా... విద్యుత్ సంస్థలు అప్పులు ఎందుకు చేస్తున్నట్లు?
అప్పుల ఊబిలో రాష్ట్ర విద్యుత్ రంగం
ఇటు ప్రజలపై మోత.. అటు రుణాలు
మరోవైపు ఏటా రూ.10 వేల కోట్ల నష్టం
2023-24లో 13,000 కోట్లు.. ఎడాపెడా ట్రూఅప్, సర్దుబాటు చార్జీలు
జగన్ పాలనలో ఎనిమిదిసార్లు మోత.. బాదేస్తున్నా తప్పని ఆర్థిక కష్టాలు
ప్రభుత్వ వరుస తప్పిదాలతో భారం.. వ్యవస్థ భవిష్యత్పైనే కలవరం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
జగన్ సర్కారు వరుస తప్పిదాలతో రాష్ట్ర విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వ్యవస్థ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. విద్యుత్ రంగం మొత్తం రుణాలు రూ.1,28,000 కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు భారీగా నష్టాలు మూటకట్టుకోవడంతో వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల వాటాగా వచ్చిన అప్పు, గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు కలిపి.. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపు 56,000 కోట్లు ఉన్నాయి. జగన్ ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్లలోనే ఏకంగా 71,910 కోట్ల అప్పులు చేశారు. అయినా కొత్తగా ఒక్క థర్మల్ పవర్ ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. ప్రజలకు కరెంట్ చార్జీల భారం తప్పలేదు. అస్తవ్యస్త విధానాలతో వ్యవస్థను నాశనం చేశారు. నష్టాలు, వ్యయాలను ట్రూఅప్, ఇంధన సర్దుబాటు చార్జీలు, సేవల పేరిట డిస్కమ్లు ప్రజలపై మోపేస్తున్నాయి. అయినా ఏటా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థకు సమర్పిస్తున్న వార్షిక ఆదాయ వ్యయ నివేదికల్లో సగటున రూ.10 వేల కోట్ల నష్టాలను చూపుతుండటం నిపుణులను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. 2023-24 వార్షిక సంవత్సరానికి సమర్పించిన నివేదికలో ఏకంగా రూ.13,000 కోట్ల మేర నష్టాలను చూపించాయి. ప్రతిపైసా ఖర్చునూ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డిస్కమ్లకు ఇంత భారీగా నష్టాలు రావడం ఆందోళన కలిగించే విషయం. బహుశా ఈ విషయాన్ని గుర్తించిన ఇంధన శాఖ నష్టాలను ప్రజల నుంచి చార్జీల రూపంలో వసూలు చేయబోమంటూ స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చార్జీల బాదుడు భరించడం అలవాటైన వినియోగదారులకు ఇంధన శాఖ చెబుతున్న మాటలు నమ్మకాన్ని కలిగించడం లేదు.
అప్పులే అప్పులు
ఈ ఏడాది మార్చి నాటికే రాష్ట్ర ఇంధన రంగానికి.. ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చిన రుణం రూ 90,000 కోట్లు, ఇంధన సంస్థలు సొంతంగా తీసుకున్న రుణం మరో రూ.38,000 కోట్లు కలిపి మొత్తం రూ.1,28,000 కోట్లు ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీగా అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇంధన శాఖ బహిర్గతం చేయడం లేదు. గడచిన నాలుగున్నరేళ్లలోనే ఇంధన రంగం రూ.71,910.18 కోట్లకు పైగా రుణాలు తీసుకుందని అంటున్నారు. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ రూ.28,832.95 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ రూ.11,005.48 కోట్లు, ఈపీడీసీఎల్ రూ.12,633.99 కోట్లు రుణాలు తీసుకున్నాయి. జెన్కో రుణం రూ.19,438.06 కోట్లు ఉంది. డిస్కమ్లు, జెన్కోకు తోడు ఏపీపీడీసీఎల్ కృష్ణపట్నంలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.18,000 కోట్ల రుణం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏపీ ట్రాన్స్కో బకాయిలు రూ.6,500 కోట్ల దాకా ఉన్నాయి.
జగన్ అనాలోచిత నిర్ణయంతో...
సహజంగా వ్యాపార, పారిశ్రామిక సంస్థలు రుణాలు తీసుకుంటుంటాయి. అయితే వరుస తప్పిదాలు చేస్తూ, దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల తాలూకు భారాన్ని వినియోగదారులపై వేస్తున్నారు. అంతేగాక భారీ నష్టాలను భరించాల్సిన దుస్థితి నెలకొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో సంప్రదాయేతర ఇంధన సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఆ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అప్పటికే బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు స్పల్పకాలిక ఒప్పందాన్ని డిస్కమ్లు చేసుకున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ సౌర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి యథాతథంగా విద్యుత్ను సేకరించాయి. దీంతో కొనుగోళ్ల భారం వినియోగదారులపై పడింది. రాజకీయ కక్షతో జగన్ సర్కారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై దాదాపు రూ.6,000 కోట్ల మేర భారం పడింది. అదేవిధంగా హెచ్పీసీఎల్ విశాఖ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ఇదే తరహా తప్పిదాలను డిస్కమ్లు చేశాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా రూ.1,234 కోట్ల మేర భారం విద్యుత్ రంగంపై పడిందని చెబుతున్నారు.
స్మార్ట్, నెట్వర్క్ భారం
రాష్ట్రంలో వ్యవసాయ, గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు రూ.14,000 కోట్ల రుణాలను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకునేందుకు డిస్కమ్లు సిద్ధమవుతున్నాయి. ఇదేతరహాలో 2024-2029లో ట్రాన్మిషన్ నెట్వర్క్ను విస్తరించేందుకు రూ.14,000 కోట్ల మేర వ్యయం చేసేందుకు ట్రాన్స్కో ప్రణాళికలు వేసింది. ఈ మొత్తాన్ని కూడా ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ రంగంలో లాభాలపై దృష్టి సారించకుండా ఇబ్బడి ముబ్బడిగా నెట్వర్క్ను, సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించి, వాటికయ్యే వ్యయాలకూ ఆర్థిక సంస్థలపైనే ఆధారపడుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుస తప్పిదాలు
జగన్ సర్కారు పగ్గాలు చేపట్టిన వెంటనే థర్మల్ విద్యుత్ కేంద్రాలను షట్డౌన్ చేస్తూ తక్కువ ధరకు దొరుకుతుందన్న సాకును చూపిస్తూ బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీనివల్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పాలనాపరమైన అస్థిర చార్జీలను భరించాల్సి వచ్చింది. స్థిర, అస్థిర చార్జీలను కలుపుకొంటే.. వాస్తవానికి జెన్కో థర్మల్ విద్యుత్కేంద్రాల్లోనే ఉత్పత్తి ధర తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వారి మాటను ఆలకించలేదు. తర్వాత మార్కెట్లో విద్యుత్ ధరలు పెరిగాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉక్కపోత పెరగడంతో విద్యుత్కు డిమాండ్ కూడా పెరిగింది. దీంతో బహిరంగ మార్కెట్లో యూనిట్ను రూ.23కు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటన్నింటికంటే ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పిదం ఏమిటంటే మధ్యప్రదేశ్లో ఏపీఎండీసీకి ఉన్న బొగ్గు తవ్వకాల వేలంలో ఏపీ జెన్కో పాల్గొనలేదు. ఈ వేలంలో అదానీ పాల్గొని టన్ను రూ.3200కే దక్కించుకుంది. ఒకవేళ జెన్కో పాల్గొనివుంటే ఈ ధరకే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్రేడ్-2 బొగ్గు దక్కేది. జెన్కో ఽథర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి వ్యయం యూనిట్కు రూ.2.80 కంటే తక్కువ ఉండేదని నిపుణులు అంటున్నారు. ఇప్పడు దేశీయ బొగ్గు టన్నుకు రూ.8,000, విదేశీ బొగ్గుకు రూ.11,500 నుంచి రూ.13,000 చెల్లించాల్సి వస్తోంది.
ఎనిమిదిసార్లు మోత
జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఎనిమిది దఫాలుగా విద్యుత్ చార్జీలను పెంచారు. 2020 ఫిబ్రవరిలో నెలకు 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్కు 90 పైసలు చొప్పున మొత్తం రూ.1300 కోట్ల భారం వేశారు. 2020 మే నెలలో కరోనా శ్లాబుల మార్పుతో రూ.1500 కోట్ల భారం వినియోగదారులపై పడింది. 2021 ఏప్రిల్లో కిలోవాట్కు రూ.10 పెంచడంతో వినియోగదారులపై రూ.3,542 కోట్ల భారం పడింది. 2014-19 ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.3,669 కోట్ల మేర వసూలు చేశారు. 2022 ఏప్రిల్లో చార్జీలను కుదించి రూ.3,900 కోట్ల మేర బాదేశారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజీ కాస్ట్ పేరుతో రూ.700 కోట్ల భారాన్ని వేశారు. 2021-22 విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరుతో రూ.3,082 కోట్ల భారం వేశారు. 2023 మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ అండ్ కాస్ట్ అడ్జెస్ట్ నుంచి రూ.400 కోట్లు, 2022-23 ట్రూఅప్ చార్జీలు రూ.7200 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదనలు పంపాయి. దీనిని ఈఆర్సీ ఆమోదించాల్సి ఉంది.
Updated Date - Dec 17 , 2023 | 07:08 AM