వైసీపీలో టికెట్ల గందరగోళం!
ABN, Publish Date - Dec 23 , 2023 | 04:03 AM
ఎన్నికల ముంగిట టికెట్ల ఖరారు విషయంలో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. శుక్రవారం రెండో జాబితా విడుదలవుతుందంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
రెండో జాబితా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
కన్నబాబు స్థానంలో చెల్లుబోయిన వస్తారన్నది సారాంశం
అయితే రాజమండ్రి రూరల్కు వెళ్తున్నానని ఇటీవల మంత్రి వెల్లడి
జాబితా ఫేక్ అన్న నేతలు.. ఎమ్మెల్యేలతో సీఎం భేటీలకు బ్రేక్
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముంగిట టికెట్ల ఖరారు విషయంలో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. శుక్రవారం రెండో జాబితా విడుదలవుతుందంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని నిజం చేస్తూ.. శుక్రవారంనాడు వైసీపీ అధికారిక లెటర్ హెడ్పై.. 8 నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమిస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. మాజీ మంత్రి కన్నబాబుకు మొండిచేయి చూపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు దాని సారాంశం. తొలి విడతలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జులను నియమించడం.. ముగ్గురు మంత్రుల స్థానాలు మార్చడం.. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజేఆర్ సుధాకరబాబుకు మొండిచేయి చూపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే సుధాకరబాబు నుంచి ఇంతవరకు స్పందన లేదు.
తాజాగా 8 మందితో రెండో జాబితా వచ్చిందంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేరు కూడా ఉండడం.. రాజకీయంగా వేడి పుట్టించింది. కాకినాడ రూరల్లో కన్నబాబు స్థానంలో మంత్రి చెల్లుబోయిన, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావు, జగ్గంపేట-తోట నరసింహం, పిఠాపురం-వంగా గీత, రామచంద్రపురం-తోట త్రిమూర్తులు, మండపేట-పిల్లి సూర్యప్రకాశ్, పాయకరావుపేట-పెడపటి అమ్మాజీ, రాజమండ్రి రూరల్కు ఎంపీ మార్గాని భరత్లను ఇన్చార్జులుగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరగడంతో కలకలం రేగింది. ఈ నియామకాలను వైసీపీ నాయకత్వం ధ్రువీకరించలేదు. ఇది పూర్తి అవాస్తవమంటూ కన్నబాబు, మరికొందరు ఖండించారు. వాస్తవానికి ప్రస్తుతం రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన ఈసారి రాజమండ్రి రూరల్కు వెళ్తారని అంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ భేటీలో ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో తాజా జాబితా నకిలీదని అర్థమవుతోంది. కాగా, క్రిస్మ్ తర్వాత మరో జాబితా విడుదలవుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
తాడేపల్లి పిలుపుతో టెన్షన్..
గత కొద్ది రోజులుగా తాడేపల్లిలో సిటింగ్లతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం.. టికెట్ ఇవ్వడం లేదంటూ చెప్పేయడంతో వారిలో తాడేపల్లి పిలుపు టెన్షన్ పెరిగిపోతోంది. అక్కడి నుంచి పిలుపు రాగానే.. ఎమ్మెల్యేలు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో.. పాలకపక్షం అభ్యర్థుల విషయంలో జరుగుతున్న ప్రచారాలు ఎలా ఉన్నా.. వైసీసీ అధిష్ఠానమే గందరగోళానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అభ్యర్థులను నవంబరు నెలాఖరునాటికి ప్రకటిస్తామని వెల్లడించిందని గుర్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా.. ప్రజాగ్రహం చవిచూస్తున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఉండదంటూ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్షాపులో జగన్ గతంలో ప్రకటించారు. ఈ సర్వే ఆధారంగానే గెలుపుగుర్రాలను ప్రకటిస్తానన్నారు. ఇందులో మొహమాటాలు అసలే ఉండవని తేల్చిచెప్పారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా.. ఎమ్మెల్యేలను పిలిచి జగన్ మాట్లాడుతున్నారు. టికెట్ ఇవ్వడం లేదని వారికి ముఖం మీదే చెప్పేస్తున్నారు. గతంలో.. ప్రత్యర్థి పార్టీల నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగిన సిట్టింగ్లు ఇప్పుడు ఆ పార్టీల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. వైసీపీ నుంచి అలిగి బయటకు వచ్చినా.. రాజకీయ జీవితం సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదు. దీంతో బయటకు వెళ్లేందుకు ధైర్యం చాలడం లేదు. ఇంకోవైపు.. ఎమ్మెల్యేలతో సీఎం భేటీలకు విరామం ఇచ్చారు. క్రిస్మస్ తర్వాత మళ్లీ మొదలవుతాయని అంటున్నారు.
Updated Date - Dec 23 , 2023 | 04:03 AM