క్రిస్మ్సకు తీపి లేదా ?
ABN, First Publish Date - 2023-12-11T01:10:05+05:30
చాలా మండలాలకు పంచదార కోటా కేటాయించలేదు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 10: తెల్లరేషన్ కార్డుదారులకు కందిపప్పు ఐదు నెలల తర్వాత అందిస్తామని చెప్పిన జిల్లా యంత్రాంగం 30 శాతం మాత్రమే పంపిణీ చేపట్టింది. దీంతో పట్టణ ప్రాంతాలకు తప్ప చాలా మండలాలకు కందిపప్పు కోటా కేటాయించలేదు. దీంతో పాటు పంచదార పంపిణీ కోటా కూడా అంతంతే. జిల్లా వ్యాప్తంగా 5.41 లక్షల బియ్యం కార్డులు చెలామణిలో ఉన్నాయి. డిసెంబరు నుంచి కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు 500 టన్నుల కందిపప్పు కావాల్సి ఉండగా, 170 టన్నులే వచ్చింది. చక్కెర కూడా 270 టన్నులకుగాను 100 టన్నులు మాత్రమే జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టణ ప్రాంతాలకు మాత్రమే కందిపప్పు, చక్కెర అరాకొరగా కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా నిలిపివేసింది. చిత్తూరుకు పరిసరాల్లోని గుడిపాల, యాదమరి, పూతలపట్టుతో పాటు పలు మండలాలకు కందిపప్పు కూడా కేటాయింపు జరగలేదు. గోధుమ పిండి 500 టన్నులు కావాల్సివుండగా, పూర్తిస్టాకు అందలేదు. రాగులు సంగతి కూడా అంతే. గత ప్రభుత్వంలో పండుగల సమయాల్లో అన్నిరకాల నిత్యవసర వస్తువులు కోటాకు మించి ఇస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం కోటాకు సంబంధించిన నిత్యవసర వస్తువులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులు ఉచిత బియ్యం మాత్రం తీసుకుని వెళ్తున్నారు.
Updated Date - 2023-12-11T01:10:06+05:30 IST