మొక్కుబడిగా ‘ఆడుదాం ఆంధ్ర’
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:21 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలకు జిల్లాలో స్పందన కన్పించలేదు. క్రీడాకారులు లేక మైదానాలు వెలవెలబోయాయి. పోటీలను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానాలు ఖాళీ అయ్యాయి. వీక్షకులుగా డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ నెమ్మదిగా జారుకోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సచివాలయ సిబ్బంది, వలంటీర్లే అంపైర్లుగా మారి మొక్కుబడిగా ఆటల పోటీలను కొనసాగించారు.
సచివాలయ సిబ్బంది, వలంటీర్లే అంపైర్లు
ఎన్నికల ప్రచార వేదికలుగా క్రీడా మైదానాలు
తిరుపతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలకు జిల్లాలో స్పందన కన్పించలేదు. క్రీడాకారులు లేక మైదానాలు వెలవెలబోయాయి. పోటీలను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానాలు ఖాళీ అయ్యాయి. వీక్షకులుగా డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ నెమ్మదిగా జారుకోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సచివాలయ సిబ్బంది, వలంటీర్లే అంపైర్లుగా మారి మొక్కుబడిగా ఆటల పోటీలను కొనసాగించారు. కొన్ని చోట్ల ఎన్నికల ప్రచార ఆర్భాటాలకు వేదికలుగా మార్చుకున్నారు. తిరుపతిలోని ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ అభ్యర్థించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న భూమన అభినయ్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.‘ అభినయ్ రెడ్డి తన తండ్రి కరుణాకర రెడ్డి కన్నా ఎక్కువ పుస్తకాలు చదువుతున్నాడు. లండన్లో చదువుకొచ్చాడు. తిరుపతిని వాటికన్ సిటీగా తీర్చిదిద్దాడు. తిరుపతి రూపురేఖలు మార్చేశారు. అలాంటి వ్యక్తిని గెలిపించాలి’ అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. చివరలో కరుణాకర రెడ్డిని ఉద్దేశిస్తూ సుమతీ శతకంలోని ‘పుత్రోత్సాహం తండ్రికి....పద్యాన్ని వినిపించారు. ప్రచార సభల్లో పోటీచేసే అభ్యర్థి లేచి నిలబడినట్టు అభినయ్ రెడ్డి గురించి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతున్నంత సేపు ఆయనకూడా లేచినిలబడ్డారు. తిరుపతి నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు నగరంలోని 29మైదానాల్లో జరిగాయి. జీవకోనలో బ్యాడ్మింటన్ పోటీ మాత్రమే జరిగింది. పద్మావతిపురం హైస్కూల్లో క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీలు జరగ్గా స్థానికులు పాల్గొనకపోవడంతో సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఆడుదాం ఆంధ్ర అంటూ మమ అనిపించారు.చంద్రగిరిలో ఉదయం కాకుండా మధ్యాహ్నం 3 గంటలపైన తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీలను ప్రారంభించారు.సత్యవేడు బాయ్స్ హైస్కూల్ ఆవరణంలో ఎమ్మెల్యే ఆదిమూలం పోటీలను ప్రారంభించగా రెండు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. క్రీడాకారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రారంభించిన కాసేపటికే మైదానం ఖాళీగా దర్శనమిచ్చింది.ఆవులు, గేదెలు సేదదీరుతూ కనిపించాయి. నాయుడుపేటలో పోటీలను రెండుసార్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే సంజీవయ్య ఉదయం రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. సాయంత్రం మళ్లీ ఎమ్మెల్యే వచ్చి క్రీడాపోటీలను ప్రారంభించారు. సూళ్లూరుపేటలో జూనియర్ కళాశాల మైదానంలో మున్సిపల్ కమిషనర్ చేతులమీదుగా మొక్కుబడిగా కార్యక్రమాన్ని ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల హడావుడే ఎక్కువగా కనిపించింది. శ్రీకాళహస్తి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో సచివాలయ సిబ్బంది , వలంటీర్లే అంపైర్లుగా వ్యవహరించారు.గూడూరు, చిల్లకూరు మండలాల్లో ఎమ్మెల్యే వరప్రసాదరావు పోటీలను ప్రారంభించగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్ పోటీలు మొక్కుబడిగా సాగాయి. వెంకటగిరిలో వైసీపీ ఇన్చార్జి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పోటీలను ప్రారంభించారు.నాలుగు మైదానాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారులు వసతులు లేకపోవడంతో ఒక మైదానంలోనే సర్దుకోమని చెప్పారు. మిగిలిన మైదానాల్లో బుధవారం నుంచి పోటీలను ప్రారంభిస్తామని తెలిపారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లే ఇక్కడ ఎక్కువగా కనిపించారు.
Updated Date - Dec 26 , 2023 | 11:21 PM