సీఎం సభకు.. జనాన్ని తీసుకురండి
ABN, Publish Date - Dec 26 , 2023 | 03:10 AM
ముఖ్యమంత్రి జగన్ మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
250 సచివాలయాల అడ్మిన్లకు హుకుం
ఒక్కో సచివాలయానికి 60 మంది లక్ష్యం
పొదుపు సంఘాలను బెదిరించి.. తరలింపు
గుంటూరు జిల్లా నల్లపాడులో సభ.. చెట్ల నరికివేత
నేడు ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించనున్న జగన్
గుంటూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే, సీఎం పాల్గొనే ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేసే బాధ్యతను పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రెటరీలకు అప్పగించారు. వీరిని పర్యవేక్షించేందుకు నోడల్ అధికారుకారులను నియమించారు. ఇక, కొంతమంది అఽధికారులు మూడు, 4 గంటలకు ఒకసారి టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించి ‘‘ఇది రాష్ట్ర స్థాయి కార్యక్రమం. సీఎం జగన్ వస్తున్నారు. మనం ప్రజలను భారీగా తరలించాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసితీరాలి’’ అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో అడ్మిన్ సెక్రెటరీలు డ్వాక్రా గ్రూపుల మహిళలను తరలించేందుకు రిసోర్స్పర్సన్లను బతిమాలుతున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోల పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 20 వేల మందినైనా తరలించాలని లక్ష్యంగా పెటుకున్నారు.
పొదుపు సంఘాలపై బెదిరింపుల కత్తి!
సీఎం పాల్గొనే కార్యక్రమానికి తొలుత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకురావాలని భావించారు. అయితే, ప్రస్తుతం అర్ధ సంవత్సరం, ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు రాబోమని తేల్చి చెప్పారు. దీంతో మహిళా పొదుపు సంఘాలే దిక్కు అన్నట్లుగా వారిని నయానో.. భయానో బెదిరించి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరం సహా చుట్టుపక్కల 250 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క దాని నుంచి 60 మంది చొప్పున తరలించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇక, ఐదేసి సచివాలయాలకు కలిపి మూడు బస్సులు కేటాయించారు. ఒక్కో బస్సులో కనీసం 60 నుంచి 80 మందిని సభకు తరలించనున్నారు. అల్పాహారం, వాటర్బాటిల్స్ కింద రూ.12,500లను ఐదు సచివాలయాలకు కలిపి విడుదల చేశారు. అయినప్పటికీ అంత వేకువజామున అంటే తమ వల్ల కాదంటూ మహిళా సంఘాల సభ్యులు తేల్చి చెప్పారు. దాంతో వారికి పథకాలు ఆగిపోతాయని బెదరగొట్టి కొంతమందిని అయినా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
35 కిలో మీటర్ల దూరానికి హెలికాప్టర్
పోలీసులు ఎప్పటిలానే సీఎం పర్యటన జరిగే ప్రాంతం పరిసరాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం.. నేరుగా లయోల పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి వేదిక వద్దకు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు. అయినప్పటికీ లయోల పబ్లిక్ స్కూల్ రోడ్డుకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ షాపులు, వ్యాపార సంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. అలానే విద్యా సంస్థలు కూడా మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, అడ్డు వస్తున్నాయన్న వంకతో చెట్లను, భారీ కొమ్మలను నరికేశారు.
Updated Date - Dec 26 , 2023 | 07:13 AM