AP debt: ఏపీ ప్రజలపై మరో రూ.2 వేల కోట్ల రుణభారం
ABN, First Publish Date - 2023-01-10T15:50:47+05:30
రాష్ట్రం అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు.
అమరావతి: రాష్ట్రం అప్పులు చేయడానికి ఒక పద్ధతి ఉంది. సొంత ఆదాయానికి మించకుండా ఖర్చులు ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు చేయవచ్చు. అది కూడా... రాష్ట్రాల ఆర్థిక వనరులు, తిరిగి చెల్లించగల స్తోమత ఆధారంగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ... జగన్ (Jagan) ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం సరిపోవడంలేదు. కేంద్రం ఇచ్చిన అప్పుల పరిమితి కూడా సరిపోవడం లేదు. అందుకే అప్పులు తేవడంపై రాష్ట్రం దృష్టి సారించింది. ఆర్బీఐ (RBI) దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా.. ఏపీ సర్కార్ మరో రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఆరేళ్లకు 7.54 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లకు బాండ్ల వేలం వేశారు. పదేళ్లకు 7.59 శాతం వడ్డీతో మరో రూ.వెయ్యి కోట్లు రుణం గతవారం ఎఫ్ఆర్బీఎం (FRBM) కింద... రూ.4,557 కోట్ల అదనపు రుణపరిమితి కేంద్రం ఇచ్చింది. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్, ఓడీ కింద ఏపీ ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చింది. రూ.2 వేల కోట్లు వచ్చినా వేతనాలు, పెన్షన్లకు మరిన్ని ఆర్థిక వనరుల కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది. పండగ నాటికైనా మొత్తం వేతనాలు, పెన్షన్లు వస్తాయాని.. ఉద్యోగులు, పెన్షన్దారులు ఎదురుచూస్తున్నారు.
ఏటేటా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగి పోతున్నాయి. మరోవైపు కొత్త అప్పుల కోసం వైసీపీ (YCP) సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జనవరి నుంచి మార్చి కాలానికి గాను రూ.12,000 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి అప్పుల కేలండర్ పంపింది. జనవరిలో రూ.7,000 కోట్లను, ఫిబ్రవరిలో రూ.4,000 కోట్లను, మార్చిలో రూ.1,000 కోట్లను తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు రూ.9 లక్షల కోట్లు దాటేశాయి. జీఎస్డీపీలో ఇవి 75 శాతం. 2018లో కేంద్రం సవరించిన ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు జీఎస్డీపీ (GSDP)లో 20 శాతం మించకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి.
అక్టోబరు నుంచే అప్పుల వేట
అక్టోబరు నుంచే కొత్తగా రూ.20,000 కోట్ల అప్పులకు అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ చుట్టూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ మంత్రి తిరుగుతున్నారు. ఇటీవల సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లి కొత్త అప్పుల కోసం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేకించి కొత్త అప్పులకు అనుమతిచ్చింది.
Updated Date - 2023-01-10T15:57:29+05:30 IST