దుండగులను అరెస్టు చేయకపోతే సమ్మె
ABN, First Publish Date - 2023-10-30T02:52:38+05:30
ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్పై దాడి చేసిన 14 మంది దుండగులను అరెస్టు చేయకపోతే సమ్మెకు కూడా వెనుకాడబోమని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,
ఆర్టీసీ ఉద్యోగ సంఘ నేతల హెచ్చరిక
విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్పై దాడి చేసిన 14 మంది దుండగులను అరెస్టు చేయకపోతే సమ్మెకు కూడా వెనుకాడబోమని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య హెచ్చరించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు చేసి, రిమాండ్కు పంపి కేసును విజయవాడకు తరలించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చి అరెస్టు చేయటంలో జాప్యం జరిగితే ‘చలో కావలి’కి పిలుపునిచ్చి భారీగా ఉద్యోగులను తరలించి మహాధర్నా నిర్వహిస్తామని, అవసరాన్ని బట్టి సమ్మెకు కూడా వెనుకాడబోమని ప్రకటించారు. ఈ మేరకు డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు. అలాగే, రాంసింగ్పై జరిగిన దాడి ఘటనను ఏపీజీఈఎఫ్ చైర్మన్ కె. వెంకట్రామిరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జగన్ స్పందించి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశిస్తానని చెప్పారని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా చంద్రయ్య, డీఎ్సపీ రావు తెలిపారు. అలాగే, ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనలకు దిగటంతో పాటు సమ్మె దిశగానూ అడుగులు వేయాలని నిర్ణయించటంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఈయూనేత పలిశెట్టి దామోదరరావుతో మాట్లాడారు. మరోవైపు.. ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మంత్రి బొత్స ఫోన్ చేసి తక్షణ చర్యలు తీసుకునేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడాల్సిందిగా సూచించారు.
క్షమాపణ చెప్పాలి: కొల్లు రవీంద్ర
ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ కుటుంబానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ఈ సంఘటనలో వైసీపీ వారిని వదిలేసి ఇతరులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.
Updated Date - 2023-10-30T02:52:38+05:30 IST