పల్స్ పోలియో విజయవంతం
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:15 AM
పల్స్ పోలియో కార్యక్రమం మొదటి రోజు చక్కటి స్పందన లభించింది. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు.
మొదటి రోజు 95 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు
జిల్లాలో నేడు, రేపు కొనసాగనున్న పోలియో చుక్కల కార్యక్రమం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): పల్స్ పోలియో కార్యక్రమం మొదటి రోజు చక్కటి స్పందన లభించింది. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ప్రారంభించారు. మూడు రోజు పాటు నిర్వహిస్తున్న చుక్కల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 4,09,308 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి రోజు 624 కేంద్రాల ద్వారా 3.98లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఇందుకు సంబంధించి 55 చొప్పున మొబైల్ టీంలు, ట్రాన్సిట్ పాయింట్లు, సమాచార విస్తరణకు వాహనాలు ఏర్పాటు చేశారు. ఆదివారం చుక్కలు వేయించని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో చుక్కల మందు వేస్తారు. ప్రతీ ఇంటికి సీరియల్ నంబర్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బం్డదీగా నిర్వహించేందుకు కలెక్టర్ శశాంక చర్యలు తీసుకుంటున్నారు. పోలియో చుక్కల కార్యక్రమంలో 681 మంది వైద్య సిబ్బంది, 1,600 మంది అంగన్వాడీ టీచర్లు, 1,385 మంది ఆశా కార్యకర్తలు, 604 మంది నర్సింగ్ కాలేజీల విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు : జిల్లా కలెక్టర్ శశాంక
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి వారందరికీ పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. ఆదివారం వేయించుకోలేని చిన్నారులకు మరో అవకాశంగా సోమ, మంగళవారం రెండు రోజుల పాటు పోలియో చుక్కలు చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పల్స్పోలియోను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వరరావు, డాక్టర్ స్వర్ణకూమారి, జిల్లా మాస్ మీడి యా అధికారి శ్రీనివాసులు, సంబంధిత డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంతో పాటు గ్రామాల్లో ధరణి సదస్సులు నిర్వహిస్తున్నందున నేడు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ కలెక్టర్ శశాంక తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.
Updated Date - Mar 04 , 2024 | 12:15 AM