జవాన్ అయినా జేబు తడపాల్సిందే!
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:59 PM
అతడు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాడే సైనికుడు. అయినా తన భూమి పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో రెండు నెలలుగా పోరాడి ఓడిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
భూమి పత్రాలిచ్చేందుకు ఆర్మీ జవాన్ నుంచి అమ్యామ్యా తీసుకున్న తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది
వీడియో చిత్రీకరణ చేసి వెలుగులోకి తెచ్చిన సైనికుడు
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
షాద్నగర్/కొందుర్గు, మార్చి 8 : అతడు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం తెగించి పోరాడే సైనికుడు. అయినా తన భూమి పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయంలో రెండు నెలలుగా పోరాడి ఓడిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తన భూమి పత్రాల కోసం లంచాలుఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందంటూ అతడు చిత్రీకరించిన వీడియోలో ఆవేదన వ్యక్తం చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన అశోక్రెడ్డి అనే సైనికుడు కొద్ది నెలల క్రితం సెలవులపై స్వగ్రామం వచ్చాడు. కొందుర్గులో తనకున్న ప్లాట్లో ఇల్లు నిర్మించుకునేందుకు లోన్ కోసం బ్యాంకు ను సంప్రదించాడు. గ్రామంలో తన పేరిట ఉన్న మూడున్నర ఎకరాలపై లోన్ తీసుకోవాలనుకున్నాడు. ఇందుకు 1954 నుంచి 2010 వరకు పహాణీలు, ఆర్ఓఆర్ పత్రాలు కావాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. కార్యాలయ రికార్డు అసిస్టెంట్ బాలరాజు, హేమంత్ అనే వారిని సంప్రదించాడు. భూమి పత్రాలు ఇవ్వాలంటే తనను వారు రూ.30వేలు లంచం డిమాం డ్ చేశారని అశోక్రెడ్డి తన వీడియోలో పేర్కొన్నాడు. తాను సైనికుడినని, తన వద్ద కూడా డబ్బులు వసూలు చేయడం సరికాదని వారితో అన్నా వారు పట్టించుకోలేదన్నాడు. ఈ విషయంపై తాను తహసీల్దార్తో మాట్లాడుతానని చెప్పినా విన్పించుకోలేదని వీడియోలో తెలిపాడు. తాము అధికారికి కూడా కొంత ముట్టచెప్పాల్సి ఉంటుందని, డబ్బులిస్తేనే పత్రాలిస్తామని కార్యాలయ సిబ్బంది మొండికేసినట్టు అశోక్రెడ్డి తెలిపాడు. దీంతో తాను మొదట రూ.10వేలు ఫోన్పే ద్వారా చెల్లించానన్నాడు. తనకు సెలవులు ముగుస్తున్నందున విధిలేని పరిస్థితిలో మిగితా రూ.20వేలు కూడా చెల్లిస్తూ తన ఫోన్లో ఈ తతంగాన్ని మొత్తం వీడియో చిత్రీకరణ చేశాడు. ‘ఈ అవినీతిని తాను అప్పుడే మీడియా దృష్టికి తేవాలనుకున్నా. కానీ మీడియాకు తెలిస్తే తన పత్రాలు ఇవ్వరేమో అనే భయంతో విలేకరులకు చెప్పలేదు.’ అని జవాన్ అన్నాడు. తాను డ్యూటీలో చేరిన తర్వాత ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. తాము దేశ సరిహద్దులో దేశ రక్షణ కోసం సేవ చేస్తోంటే తమను కూడా లంచాలు అడగడం బాధాకరం అని అశోక్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా కార్యాలయ సిబ్బంది జవాన్ను లంచం అడిగిన తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
దీని గురించి నాకు తెలియదు : రమే్షకుమార్, తహసీల్దార్
కాగా ఈ విషయం గురించి తనకు తెలియదని తహసీల్దార్ రమేష్ కుమార్ అన్నారు. తాను కొన్ని రోజులుగా 58, 59 జీవోలకు సంబంధించిన సర్వే పనుల్లో బిజీగా ఉన్నానన్నారు. అలాగే కొన్ని రోజుల క్రితం తన సోదరుడు మరణించడంతో కొన్ని రోజులు సెలవుపెట్టానన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చే పని రికార్డ్స్ విభాగం డిప్యుటీ తహశీల్దార్ చూసుకుంటారన్నారు. ఈ సంఘటన గురించి తనకు ఏమీ తెలియదని, డిప్యూటీ తహసీల్దార్ను సోమవారం అడిగి వివరాలు తీసుకుంటాన్నాడు. ఇదే విషయమై డిప్యూటీ తహసీల్దార్కు ఫోన్చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
Updated Date - Mar 08 , 2024 | 11:59 PM