‘నందికొండ’ చైర్పర్సన్పై నెగ్గిన అవిశ్వాసం
ABN, Publish Date - Feb 16 , 2024 | 05:44 AM
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఏర్పడిన నందికొండ (నాగార్జునసాగర్) మునిసిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ రెండు పదవులకు బీఆర్ఎస్
చైర్పర్సన్ పదవి కాంగ్రెస్కు, వైస్చైర్మన్ పదవి బీఆర్ఎస్కు ఇచ్చేలా నిర్ణయం
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఏర్పడిన నందికొండ (నాగార్జునసాగర్) మునిసిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ రెండు పదవులకు బీఆర్ఎస్ ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. తాజాగా చైర్పర్సన్ పదవిని కాంగ్రె్సకు, వైస్చైర్మన్ పదవిని బీఆర్ఎ్సకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కనీసం గ్రామ పంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను గత ప్రభుత్వం 2018 ఆగస్టులో నాగార్జునసాగర్లో ఉన్న హిల్కాలనీ, పైలాన్ కాలనీలను కలిపి 12 వార్డులతో నందికొండ మునిసిపాలిటీగా ఏర్పాటు చేసింది. 2020 జనవరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్9, కాంగ్రెస్ 3వార్డులు గెలుచుకోగా చైర్పర్సన్, వైస్చైర్మన్గా బీఆర్ఎ్సకు చెందిన కర్ణ అనూష, మంద రఘువీర్ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల తర్వాత రెండో వార్డు కౌన్సిలర్ సత్తెమ్మ (కాంగ్రెస్) గుండెపోటుతో మృతి చెందగా ప్రస్తుతం 11మంది కౌన్సిలర్లున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రె్సలో చేరగా కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. చైర్పర్సన్, వైస్చైర్మన్ మినహా మిగతా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రె్సకు మద్దతుగా నిలిచారు. కాగా చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, వార్డుల్లో సమస్యలను తీర్చడానికి కౌన్సిలర్లకు సహకరించడం లేదని 2022లో తొమ్మిది మంది వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు అందజేశారు. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం చేపట్టేలా హైకోర్టు స్టే ఇవ్వడంతో 2023లో కలెక్టర్కు మరోసారి అవిశ్వాసం నోటీసు అందజేశారు. రెండోసారి చైర్పర్సన్, వైస్ చైర్మన్లు కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. మూడోసారి అవిశ్వాసం కోరుతూ ఈ ఏడాది జనవరి 29న కలెక్టర్కు దరఖాస్తు చేశారు. దీంతో కలెక్టర్ మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్యను ప్రిసైడింగ్ అధికారిగా నియమించి ఈ నెల 15నఅవిశ్వాసానికి సంబంధించిన సమావేశం చేపట్టాలని ఆదేశించారు. దీంతో నందికొండ మునిసిపాలిటీలో గురువారం అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగ్గా 11మంది కౌన్సిలర్లలో నలుగురు కాంగ్రెస్, ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. చైర్పర్సన్ పదవిని కాంగ్రె్సకు, వైస్చైర్మన్ పదవిని బీఆర్ఎ్సకు ఇచ్చేందుకు 9మంది కౌన్సిలర్లు నిర్ణయించారు. 15 రోజుల్లో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని ఆర్డీవో తెలిపారు.
Updated Date - Feb 16 , 2024 | 07:05 AM