హామీలను వంద శాతం అమలు చేస్తాం
ABN, Publish Date - Feb 20 , 2024 | 12:06 AM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
బోయినపల్లి, ఫ్రిబవరి 19: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బోయినపల్లి మండలం నీలోజుపల్లిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ, గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడంతో పథకాల అమలుకు కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. హామీలను త్వరితగతిన అమలు చేస్తామన్నారు. సమ్మక్క, సారక్క జాతర దృష్ట్యా 6 వేల బస్సులను కేటాయించామని, మహిళలు జాతర ముగిసే వరకు అసౌకర్యంగా భావించవద్దని అన్నారు. అంతే కాకుండా మహానీయుల విగ్రహాలను గ్రామంలో నెలకొల్పడం అభినందనీయమని, వారి పోరాట పటిమ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మిడ్ మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలను మంత్రి పొన్నం, మేడిపల్లిసత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకవెళ్లామని అన్నారు. నిర్వాసితుల సమస్యలను సత్వరమే పరిష్కారిస్తామన్నారు. జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, మాజీ జడ్పీటీసీ బోలుమాల శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, మండల అరెకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిమ్మాపురం సత్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 20 , 2024 | 12:06 AM