చుట్టపు చూపుగా ఆస్పత్రికి!
ABN, Publish Date - Mar 03 , 2024 | 04:22 AM
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు.
పీహెచ్సీల్లో వైద్యుల ఇష్టారాజ్యం
సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం
విధులు నిర్వర్తించేది కేవలం 2-3 గంటలే
సీసీ కెమెరాలున్నా పని చేయని వైనం
వైద్యశాఖ అధికారుల పర్యవేక్షణ కరువు
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ఏ రోజూ సమయానికి రారు. ఉదయం పదకొండు తర్వాతే ఆయన డ్యూటీకి వస్తారు. మధ్యాహ్నం రెండు కాకముందే వెళ్లిపోతారు. ఆ పీహెచ్సీలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. సీసీ కెమెరాల వైర్లను కావాలనే తొలగించినట్లు కనిపిస్తోంది.
యాదాద్రి జిల్లాలోని కొండమడుగు పీహెచ్సీ వైద్యుడు ఏ రోజూ టైమ్కు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే రెండు రోజులకోసారి డ్యూటీకి వస్తారు. వచ్చినా కేవలం రెండు గంటలే ఉంటున్నారు. రోజురోజు విడిచి రోజు డాక్టర్ డ్యూటీకి వస్తుండటంతో అక్కడి ప్రజలు పీహెచ్సీకి రావడమే మానేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఏదో చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లే వారే తప్ప.. నిర్ణీత సమయం డ్యూటీ చేసే డాక్టర్లే కనిపించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 636 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్రు, 232 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 12 గంటలపాటు పనిచేసే పీహెచ్సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, 24 గంటలపాటు పనిచేసే పీహెచ్సీల్లో షిప్టుల వారీగా రాత్రి, పగలు వైద్యులు పని జేయాలి. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పీహెచ్సీలోనూ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మెజారిటీ పీహెచ్సీల్లో ఉదయం 11 తర్వాతే వైద్యులు విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకే తిరిగి వెళ్లిపోతున్నారు. కొందరు వైద్యులైతే రోజు విడిచి రోజు పీహెచ్సీకి వస్తున్నారు. పీహెచ్సీలకు వెళ్తే వైద్యులు ఉంటారన్న గ్యారెంటీ లేకపోవడంతో ప్రజలు అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా పీహెచ్సీల్లో వైద్య సేవలు మరింత దిగజారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
80% పీహెచ్సీల్లో సీసీ కెమెరాలు బంద్
గత ప్రభుత్వ హయాంలో ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ హైదరాబాద్లోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. అన్ని పీహెచ్లను ఇక్కడి నుంచే పర్యవేక్షించేవారు. దీంతో డాక్టర్లు, నర్సులు గైర్హాజరైతే వెంటనే తెలిసిపోయేది. సదరు డాక్టర్లకు వెంటనే నోటీసులు ఇచ్చే వారు. ఇలాంటి నిఘా వ్యవస్థ.. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 80 శాతం పీహెచ్సీల్లో ప్రస్తుతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అని అడిగే వారే కరువయ్యారని ఓ జిల్లాకు చెందిన పీహెచ్సీ వైద్యుడు ’ఆంధ్రజ్యోతి‘కి తెలిపారు. ఉదాహరణకు భద్రాద్రి జిల్లాలో 29 పీహెచ్సీలు ఉంటే.. 20 చోట్ల, యాదాద్రి జిల్లాలో 19 పీహెచ్సీలు ఉంటే..13 చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల డాక్టర్లు, సిబ్బంది కుమ్మక్కై సీసీ కెమెరాల కనెక్షన్స్ తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంటర్నెట్ రావడం లేదని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం పీహెచ్సీల్లో కెమెరాలు రోజూ ఆఫ్లైన్లోనే ఉంటున్నాయి. దీనిపై ఎవ్వరరికీ పట్టింపులేకుండాపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
350 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లో కలిపి 350 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వంద చోట్ల కాంట్రాక్టు వైద్యులతో పని చేయిస్తున్నారు. నిజానికి ప్రతీ పీహెచ్సీలోనూ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా.. ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఇటీవల కొందరు కాంట్రాక్టు, రెగ్యులర్ ఎంబీబీఎస్ వైద్యులకు పీజీ సీట్లు రావడం, డిప్యూటేషన్లను రద్దు చేయడం వంటి కారణాలతో పీహెచ్సీల్లో ఆ ఒక్క డాక్టర్ కూడా కనిపించడం లేదు. దీనికితోడు తాజాగా రెగ్యులర్ నియామకాలు చేపట్టడంతో పీహెచ్సీల్లో పని చేస్తే కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కూడా వెళ్లిపోయారు. అటు వైద్యులు లేక, ఇటు స్టాఫ్నర్సులు తగినంత మంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
Updated Date - Mar 03 , 2024 | 04:22 AM