గురుకుల జేఎల్ పరీక్ష ఫలితాలు విడుదల
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:16 AM
రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు(ట్రిబ్) గురువారం సాయంత్రం ప్రకటించింది. పరీక్ష ఫలితాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు(ట్రిబ్) గురువారం సాయంత్రం ప్రకటించింది. పరీక్ష ఫలితాలను గురుకుల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొత్తం 1,924 జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టులకు పరీక్ష నిర్వహించగా.. 1ః2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ప్రస్తుతం 1,767 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో ఎంపికైన అభ్యర్ధులకు సంబంఽధించిన మెడికల్ సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉండడంతో ఆ పోస్టులను పెండింగ్లో ఉంచారు. కాగా టీజీటీ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో ఆయా పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు అందించేందుకు ట్రిబ్ కసరత్తు చేస్తోంది.
ఫలితాల్లో నల్లగొండ యువకుల సత్తా...
నల్లగొండ టౌన్: గురుకుల డిగ్రీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మునగాల తుర్కపల్లికి చెందిన మాసంపల్లి హరికృష్ణ గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో గణిత విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు(ఓపెన్ కేటగిరిలో) సాధించారు. కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న హరికృష్ణ గురుకుల పాఠశాలలో పీజీటీగా, గ్రూప్-4లో 544వ ర్యాంక్తోనూ మెరిశారు. అలాగే, నల్లగొండకు సమీపంలోని అక్కలాయిగూడేనికి చెందిన కన్నెబోయిన రామరాజు ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించారు. గురువారం ప్రకటించిన జేఎల్ ఫలితాల్లో కెమిస్ర్టీ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. అలాగే బుధవారం ప్రకటించిన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ఆరో ర్యాంకు పొందారు. గురుకుల పాఠశాలలో పీజీటీ విభాగంలో ఫిజికల్ సైన్స్లో రాష్ట్రస్థాయి 9వ ర్యాంకు సాధించారు. ఒకే సారి మూడు ఉద్యోగాలు సాధించిన రామరాజు డిగ్రీ లెక్చరర్గా చేరతానని తెలిపాడు. రామరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూ, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటూ రామరాజు ఉద్యోగ పరీక్షల్లో సత్తా చాటారు. కాగా, గురుకుల నియామకాల్లో హిందీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ విభాగం ఆరోపించింది. ప్రస్తుతం గురుకులాల్లో జరుగుతున్న నియామక ప్రక్రియలో టీజీటీ పోస్టులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ ఇచ్చిన సర్టిఫికెట్లు చెల్లవనడం సమంజసం కాదని పేర్కొంది. దీని వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని, ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని కోరింది.
Updated Date - Mar 01 , 2024 | 04:16 AM