మేడారం హుండీల లెక్కింపు షురూ
ABN, Publish Date - Mar 01 , 2024 | 04:27 AM
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ
పది రోజుల వరకు కొనసాగే అవకాశం
హుండీల్లో అంబేడ్కర్ బొమ్మ ఉన్న రూ.100 నోట్లు
హనుమకొండ, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దేవాదాయ, రెవెన్యూ శాఖల సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు 350 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లెక్కింపు పూర్తి కావడానికి పది రోజులు పట్టవచ్చని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత తెలిపారు. లెక్కింపును వేగవంతం చేయడానికి ఈసారి నోట్ల నుంచి నాణేలను వేరుచేయడానికి ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్లో అక్రమాలు జరగకుండా కేంద్రం లోపల, బయట 60కిపైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హుండీల్లోని చాలా నోట్లు బెల్లం, పసుపు, కుంకుమలతో తడిసి ముద్దయ్యాయి. వాటిని సబ్బు నీళ్లలో నానబెట్టి, కడిగి, ఇస్త్రీ చేస్తున్నారు. పూర్తిగా చిరిగిపోయిన నోట్లను పక్కన పెడుతున్నారు. హుండీల్లో నోట్లతో పాటు బంగారు, వెండి కానుకలు కూడా బయటపడుతున్నాయి. లెక్కించిన నోట్లను ఏరోజుకారోజు బ్యాంకులో జమ చేయనున్నారు. మొదట తెరిచిన హుండీల్లో అంబేడ్కర్ బొమ్మ ఉన్న రూ.100 నోట్లు ఐదారు నోట్లు వచ్చాయి. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ చిత్రాన్ని ముద్రించాలన్న డిమాండ్ వాటిపై రాసి ఉంది. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎవరో ఇలాంటి నోట్లను ముద్రించి ఉంటారని భావిస్తున్నారు.
Updated Date - Mar 01 , 2024 | 07:25 AM