పట్టు చిక్కినట్టే..
ABN, Publish Date - Feb 18 , 2024 | 02:17 AM
మూడో రోజు ఆటలో భారత్ ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. అలాగే ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ గేమ్కు దీటుగా ఓపెనర్ యశస్వీ జైస్బాల్ (133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 రిటైర్డ్ హర్ట్) గేమ్తో చెలరేగాడు...
జైస్వాల్ మెరుపు శతకం
ప్రస్తుత ఆధిక్యం 322
భారత్ రెండో ఇన్నింగ్స్ 196/2
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 319
సిరాజ్కు నాలుగు వికెట్లు
రాజ్కోట్: మూడో రోజు ఆటలో భారత్ ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. అలాగే ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ గేమ్కు దీటుగా ఓపెనర్ యశస్వీ జైస్బాల్ (133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 104 రిటైర్డ్ హర్ట్) గేమ్తో చెలరేగాడు. ఆదిలో నెమ్మదిగా ఆరంభమైన అతడి ఇన్నింగ్స్ కాస్త కుదురుకున్నాక తుఫాన్ వేగంతో దూసుకెళ్లింది. బౌలర్ ఎవరైనా వైవిధ్యమైన స్వీప్ షాట్లతో, ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ కెరీర్లో మూడో శతకాన్ని పూర్తి చేశాడు. మరో యువ బ్యాటర్ గిల్ (65 బ్యాటింగ్) అజేయ అర్ధసెంచరీతో నిలిచాడు. వీరిద్దరి సమయోచిత ఆటతీరుతో మూడో టెస్టులో భారత్ 322 పరుగుల భారీ ఆధిక్యం అందుకుంది. శనివారం మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 196/2 స్కోరు సాధించింది. గిల్కు జతగా క్రీజులో కుల్దీప్ (3) ఉన్నాడు. అంతకుముందు అశ్విన్ లేకపోయినా భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను సమర్థవంతంగా కట్టడి చేశారు. పేసర్ సిరాజ్ 4 వికెట్లతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 126 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జడేజా, కుల్దీ్పకు రెండేసి వికెట్లు దక్కాయి. డకెట్ (153), స్టోక్స్ (41) రాణించారు. ఆదివారం ఆధిక్యాన్ని దాదాపు 450 రన్స్కు చేర్చితే భారత్ తిరుగులేని స్థితికి చేరుకుంటుంది.
మరో 112 పరుగులే: అశ్విన్ లేకపోవడంతో మూడో రోజు భారత్ నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగింది. అటు ఓవర్నైట్ స్కోరు 207/2తో పటిష్ఠ స్థితిలో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నుంచి భారీ స్కోరు ఖాయమే అనిపించింది. డకెట్తో పాటు రూట్ క్రీజులో ఉండడమే దీనికి కారణం. కానీ స్పిన్నర్ కుల్దీప్ లయ అందుకోవడంతో పాటు పేసర్ సిరాజ్ పదునైన బంతులకు ఆ జట్టు అనూహ్యంగా తడబడింది. చివరకు మరో 112 రన్స్ మాత్రమే చేసి మిగిలిన వికెట్లన్నీ కోల్పోయింది. తొలి సెషన్లోనే రూట్, డకెట్, బెయిర్స్టో అవుటవడం జట్టును దెబ్బతీసింది. బుమ్రా ఓవర్లో రూట్ అనవసరంగా రివర్స్ ర్యాంప్ షాట్కు యత్నించి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చా డు. ఆ వెంటనే బెయిర్స్టోను కుల్దీప్ డకౌట్ చేశాడు. అనంతరం డకెట్, స్టోక్స్ రక్షణాత్మకంగా ఆడారు. 150 పరుగులు చేశాక డకెట్ ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. కుల్దీప్ వైడ్ బాల్ను వేటాడి కవర్స్లో గిల్కు క్యాచ్ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. రెండో సెషన్లో సిరాజ్ చెలరేగడంతో ఇంగ్లండ్కు కష్టాలు పెరిగాయి. చక్కగా పాతుకుపోయిన స్టోక్స్ను జడేజా దెబ్బతీయడంతో భారత్ సంబరాల్లో మునిగింది. డీప్ మిడ్వికెట్లో బుమ్రా అతడి క్యాచ్ను తీసుకున్నాడు. ఆ వెంటనే ఫోక్స్ (13), రెహాన్ (6), అండర్సన్ (1)లను సిరాజ్.. హార్ట్లీ (9)ని జడేజా పెవిలియన్ చేర్చడంతో 20 పరుగుల వ్యవధిలోనే ఆఖరి 5 వికెట్లను కోల్పోయింది.
‘జైస్బాల్’ దూకుడు: రెండో సెషన్లోనే భారత్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. అయితే ఎలాంటి తొందరపాటును చూపకుండా నిదానంగా ఆడింది. దీంతో టీ బ్రేక్కల్లా 16 ఓవర్లలో కెప్టెన్ రోహిత్ (19) వికెట్ను కోల్పోయి 44 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ తొలి 50 బంతుల్లో 18 పరుగులే చేశాడు. ఆఖరి సెషన్లో అతడితో పాటు గిల్ బౌలర్లపై ప్రతాపం చూపారు. ముందుగా రిస్కీ షాట్లకు వెళ్లకుండానే స్కోరు పెంచారు. ఆధిక్యం 200కు చేరాక జైస్వాల్ జూలు విదిల్చాడు. అండర్సన్ ఓవర్లో వరుసగా 6,4,4తో బ్యాట్కు పనిచెప్పాడు. తర్వాతి ఓవర్లోనే రెండు వరుస సిక్సర్లను బాదడంతో స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుంటూ స్వీప్ షాట్లతో జైస్వాల్ సాధించిన బౌండరీలు అబ్బురపరిచాయి. ఈ ధనాధన్ బ్యాటింగ్తో అతడు ఈ సిరీ్సలో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు గిల్ సైతం 6,4తో అర్ధసెంచరీ సాధించాడు. అయితే సెంచరీ అయిన కాసేపటికే జైస్వాల్ వెన్నునొప్పితో మైదానం వీడాడు. రెండో వికెట్కు వీరి మధ్య 155 రన్స్ వచ్చాయి. రజత్ డకౌటవగా.. గిల్, కుల్దీప్ మూడో రోజును ముగించారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 445; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) రజత్ (బి) అశ్విన్ 15; డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153; పోప్ (ఎల్బీ) సిరాజ్ 39; రూట్ (సి) జైస్వాల్ (బి) బుమ్రా 18; బెయిర్స్టో (ఎల్బీ) కుల్దీప్ 0; స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41; ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రెహాన్ (బి) సిరాజ్ 6; హార్ట్లీ (స్టంప్) జురెల్ (బి) జడేజా 9; ఉడ్ (నాటౌట్) 4; అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్ట్రాలు: 20; మొత్తం: 71.1 ఓవర్లలో 319 ఆలౌట్. వికెట్ల పతనం: 1-89, 2-182, 3-224, 4-225, 5-260, 6-299, 7-299, 8-314, 9-314, 10-319. బౌలింగ్: బుమ్రా 15-1-54-1; సిరాజ్ 21.1-2-84-4; కుల్దీప్ 18-2-77-2; అశ్విన్ 7-0-37-1; జడేజా 10-0-51-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వీ జైస్వాల్ (రిటైర్డ్ హర్ట్) 104; రోహిత్ (ఎల్బీ) రూట్ 19; గిల్ (బ్యాటింగ్) 65; రజత్ (సి) రెహాన్ (బి) హార్ట్లీ 0; కుల్దీప్ (బ్యాటింగ్) 3; ఎక్స్ట్రాలు: 5; మొత్తం: 51 ఓవర్లలో 196/2. వికెట్ల పతనం: 1-30, 2-191. బౌలింగ్: అండర్సన్ 6-1-32-0; రూట్ 14-2-48-1; హార్ట్లీ 15-2-42-1; ఉడ్ 8-0-38-0; రెహాన్ 8-0-31-0.
1
భారత్పై టెస్టుల్లో ఎక్కువసార్లు (8) డకౌటైన బ్యాటర్గా బెయిర్స్టో
పది మందితోనే..
అశ్విన్ లేకపోవడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో పది మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నలుగురు బౌలర్లు మాత్రమే ఉంటారు. నిబంధనల ప్రకారం కంకషన్ సబ్స్టిట్యూట్కే బౌలింగ్, బ్యాటింగ్ చేసే వీలుంది. కానీ అశ్విన్ అత్యవసర పరిస్థితి కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగాడు. కాబట్టి మరో ప్లేయర్ అతడి విధులను నిర్వర్తించలేడు. ప్రస్తుతానికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్ స్టోక్స్ అనుమతితో దేవ్దత్ పడిక్కళ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా ఉన్నాడు.
నల్ల బ్యాండ్లతో బరిలోకి..
మాజీ కెప్టెన్ దత్తాజీరావ్ గైక్వాడ్ మృతికి నివాళిగా మూడో రోజు శనివారం ఆటలో భారత ఆటగాళ్లు భుజానికి నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగారు. ఈనెల 13న గైక్వాడ్ అనారోగ్యంతో మృతి చెందారు. అయితే టెస్టు తొలిరోజునే ఆటగాళ్లు నివాళి అర్పించాల్సిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
తల్లి అనారోగ్యం వల్లే..
తల్లి తీవ్ర అనారోగ్యం కారణంగానే అశ్విన్ అర్ధంతరంగా మూడో టెస్టును వీడినట్టు సమాచారం. రెండో రోజు ఆటలో 500 వికెట్లు పూర్తి చేసిన అశ్విన్ శుక్రవారమే చెన్నై బయలుదేరాడు. ‘అశ్విన్ తల్లి వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో ఆమెతో పాటు ఉండేందుకు అశ్విన్ చెన్నైకి వెళ్లనున్నాడు’ అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఎక్స్లో పోస్ట్ చేశాడు.
వెన్నునొప్పితో మైదానం వీడాడు
భారత్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీతో కదం తొక్కిన యశస్వీ జైస్వాల్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది. శతకం పూర్తయిన కాసేపటికే అతను వెన్నునొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేసినా.. కాసేపటికే మళ్లీ నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతను మైదానం వీడడంతో రజత్ క్రీజులోకి వచ్చాడు. అయితే జైస్వాల్ నొప్పి తీవ్రతను బట్టి నాలుగో రోజు బరిలోకి దిగుతాడా లేడా అనేది తేలుతుంది.
Updated Date - Feb 18 , 2024 | 02:17 AM