కేంద్రం హెచ్చరికతో దిగొచ్చిన గూగుల్
ABN, Publish Date - Mar 03 , 2024 | 04:55 AM
సర్వీసు రుసుము చెల్లింపు వివాదంతో ప్లే స్టోర్ నుంచి పలు భారతీయ స్టార్టప్ కంపెనీల యాప్లను తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను తాము అంగీకరించబోమని సెర్చ్ ఇంజన్ దిగ్గజం
ప్లేస్టోర్ నుంచి తొలగించిన పది యాప్ల పునరుద్ధరణ
న్యూఢిల్లీ, మార్చి 2: సర్వీసు రుసుము చెల్లింపు వివాదంతో ప్లే స్టోర్ నుంచి పలు భారతీయ స్టార్టప్ కంపెనీల యాప్లను తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను తాము అంగీకరించబోమని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్కు తేల్చిచెప్పింది. కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ స్టార్టప్ రంగం భారతీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకం అని, వాటి భవితవ్యాన్ని ఏ సాంకేతిక దిగ్గజానికో వదిలివేయలేమని స్పష్టం చేశారు. స్టార్ట్పలకు అవసరమైతే అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గూగుల్తో పాటు స్టార్టప్ ప్రతినిధులను సోమవారం చర్చలకు పిలిచారు. కాగా, శుక్రవారం గూగుల్ 10 యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ప్రముఖ మ్యాట్రిమోనీ.కామ్కు చెందిన భారత్ మ్యాట్రిమోనీ, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, ముస్లిం మ్యాట్రిమోనీ, జోడీతో పాటు ఇన్ఫో ఎడ్జ్కు చెందిన జీవన్ సాథీ వీటిలో ఉన్నాయి. తమకు సంబంధించిన నౌకరీ, నౌకరీ రిక్రూటర్, నౌకరీ గల్ఫ్, 99 ఎకర్స్, శిక్షా యాప్లనూ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు ఇన్ఫో ఎడ్జ్ శనివారం పేర్కొంది. ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని తెలిపింది. ప్రభుత్వ తీవ్ర హెచ్చరికతో సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. నౌకరీ, 99 ఎకర్స్ తదితర యాప్లను గూగుల్ ప్లేస్టోర్లో పునరుద్ధరించింది. కాగా, గూగుల్ సర్వీస్ రుసుములను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంస్థల్లో మ్యాట్రిమోనీ.కామ్, ఇన్ఫో ఎడ్జ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్తో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా కూడా ఉంది.
Updated Date - Mar 03 , 2024 | 07:30 AM