విద్యాదీవెన బకాయిలపై మౌనం
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:09 AM
జగనన్న విద్యా దీవెన సొమ్ముల విడుదలకు సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కారు. విద్యార్థులకు మాత్రం సొమ్ములు జమ కాలేదు.
మాటిచ్చి మడమ తిప్పిన జగన్
కళాశాలల యాజమాన్యాలకు కుచ్చుటోపీ
నాలుగో సంవత్సరం విద్యార్థుల పరిస్థితి గందరగోళం
(భీమవరం–ఆంధ్రజ్యోతి) :
జగనన్న విద్యా దీవెన సొమ్ముల విడుదలకు సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కారు. విద్యార్థులకు మాత్రం సొమ్ములు జమ కాలేదు. కళాశాలలకు ప్రొసీడింగ్స్ జారీ చేసిన తర్వాత తల్లుల ఖాతాలో జమచేయనున్నారు. అదికూడా విడతల వారీగా విడుదల చేస్తున్నారు. వాస్తవానికి 2023–24 సంవత్సరానికి సంబంధించి తొలి విడత ఫీజు రీఎంబర్స్మెంట్కు మాత్రమే ముఖ్యమంత్రి బటన్ నొక్కారు. అదే ఇప్పుడు చివరి సంవత్సర విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంజనీరింగ్, డిగ్రీ చివరి సంవత్సరం చ దువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ నాటికి పరీక్షలు పూర్తి కానున్నాయి. తదుపరి ఫలితాలు విడుదల చేస్తారు. ఉన్నత విద్య చదవాలన్నా, ఉద్యోగాల్లో చేరాలన్నా విద్యార్థులకు సర్టిఫికెట్లు అవసరం కానున్నాయి. ఈ ఏడాది దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని బయటకు వెళతారు. వారందరికీ ప్రభుత్వం దాదాపు రూ. 25 కోట్లు చెల్లించాలి. అప్పుడే విద్యా సంవత్సరం మొత్తానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చేసినట్టవుతుంది. అంటే నాలుగు విడతల సొమ్మును ఒకేసారి విడుదల చేయాలి. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇప్పుడే నాలుగు విడుతల సొమ్మును ప్రభుత్వం జమ చేయాలి. కానీ ఒక్క విడతకు మాత్రమే ముఖ్యమంత్రి బటన్ నొక్కారు. జిల్లాలో 33,400 మంది విద్యార్థులకు తొలి త్రైమాసికానికి రూ.25కోట్లు మేర చెల్లిస్తున్నట్టు ప్రకటించారు. కానీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన నాలుగు విడుతల ఫీజుపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది పూర్తిస్థాయిలో సొమ్ములు చెల్లించామంటూ ప్రభుత్వం లెక్కకు మిక్కిలి గొప్పలు చెబుతోంది. ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం మౌనం పాటించింది.
తల్లుల ఖాతాతోనే ఇబ్బందులు
ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును తల్లుల ఖాతాలోనే జవ ుచేయడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు నేరుగా కళాశాలల ఖాతాల్లో జమచేసేవి. యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టేవి కాదు. సర్టిఫికెట్లు ఇచ్చేవి. ప్రభుత్వం తదుపరి కాలేజీలకు బకాయిలు చెల్లించేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంది. కళాశాలల ఖాతాలకు జమ చేయడం లేదు. తల్లుల ఖాతాల్లో ఫీజు రీంబర్స్మెంట్ జమచేస్తోంది. వారం రోజుల్లోనే కళాశాలలకు చెల్లించాలంటూ స్పష్టం చేస్తోంది. దీనివల్ల విద్యార్థులకు కలిసి వచ్చేదేమీ లేదు. పైగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వ స్తోంది. అదికూడా ముఖ్యమంత్రి బటన్ నొక్కిన నెల రోజులకు గానీ తల్లుల ఖాతాలో ఫీజురీఎంబర్స్మెంట్ జమ కావడం లేదు. కేటగిరీల వారీగా ప్రభుత్వం సొమ్ములు విడుదల చే స్తోంది.
ఒక క్వార్టర్ ఎగ్గొట్టినట్టే
కరోనా సమయంలో ఒక క్వార్టర్ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇప్పటివరకు విద్యార్థులు ఎదురుచూస్తూ వస్తున్నారు. కళాశాల లు విద్యార్థులనుంచి ముక్కుపిండి వసూలు చేశాయి. జిల్లాలో దాదాపు రూ.25కోట్లు విద్యార్థులు చెల్లించారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం తల్లుల ఖాతా లో జమ చేస్తుందని ఆశించారు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. కరోనా కాలంలో తరగతులు నిర్వహించలేదంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. అంతే తప్పా కళాశాలలను ఏమీ చేయలేకపోయింది. విద్యార్థులనుంచి యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తుంటే మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేమంటూ కళాశాలలు తేల్చి చెప్పాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోయారు. బకా యిపడ్డ ఒక క్వార్టర్ ఫీజు రీఎంబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేస్తుం దని విద్యార్థులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచ న చేయడంలేదు. ఎన్నికల ఏడాది కావడంతో ఆశలు వదులుకోవాల్సిందే.
హాల్ టిక్కెట్లతో ముడి
మరోవైపు చివరి సంవత్సరం విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్పై ప్రభుత్వం స్పందించడం లేదు. ఏడాది మొత్తం ఫీజును చెల్లించాలి. లేదంటే విద్యార్థులపై ఆర్థికభారం పడనుంది. పరీక్షల ముందే ఫీజులపై కళాశాలలు ఒత్తిడి చేయనున్నాయి. లేదంటే హాల్ టిక్కెట్లు ఇవ్వలేమంటూ మెలిక పెడుతున్నాయి. ప్రతి ఏడాది ఇదేతంతు జరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న తప్పిదానికి విద్యార్థులు బలవుతున్నారు. ముందుగానే ఫీజు చెల్లించి పరీక్షలు రాసేందుకు అప్పులు చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్టు కానరావడం లేదు. చివరి ఏడాది విద్యార్థుల విషయంలో మౌనం పాటిస్తోంది. అదే జరిగితే విద్యార్థులు ముందుగానే ఫీజులు చెల్లించాలి. తదుపరి ప్రభుత్వం విడుదల చేస్తుంది.
పీజీ బకాయిలు ఏవి ?
ప్రభుత్వంపై కళాశాల యాజమాన్యాలు విశ్వసనీయత కోల్పోయాయి. పీజీ విద్యార్థులకు సంబంధించిన బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. జిల్లాలో దాదాపు రూ.20కోట్ల బకాయిలున్నాయి. అందులో 75 శాతం అంటే రూ.15కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం నమ్మ బలకింది. కళాశాలలు సైతం అందుకు అంగీకరించాయి. ఇప్పటివరకు పైసా విడుదల చేయలేదు. త్వరలోనే 2023–24 విద్యా సంవత్సరం తొలి త్రైమాసిక ఫీజును విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాటి తోనైనా బకాయిలు చెల్లిస్తుందని యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి.
పీజీ కోర్సులకు మొండి చేయి
ఎన్నికల ముందుకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. విద్యార్థులు ఎంతవరకు చదవుకున్నా సరే ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. మడమ తిప్పారు. పీజీ కోర్సులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడం లేదు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. విదేశీ విద్యా పథకంపైనా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. టీడీపీ హయాంలో అమలు చేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా కానుకను నిలిపివేసింది. ఇటీవల మళ్లీ అమలు చేస్తోంది. అదికూడా ఆంక్షలు విధించడంతో విదేశీ విద్యపై విద్యార్థులనుంచి స్పందన కొరవడింది.
Updated Date - Mar 03 , 2024 | 12:09 AM