షాపు నెం.20 కథేమిటో?
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:01 AM
మున్సిపల్ కాంప్లెక్స్లో షాపు నెంబరు 20 కథేమిటంటూ వైస్ చైర్పర్సన్ జరజాపు దీప్తి, కౌన్సిలర్లు.. మున్సిపల్ అధికారులపై ధ్వజమెత్తారు.
సాలూరు రూరల్: మున్సిపల్ కాంప్లెక్స్లో షాపు నెంబరు 20 కథేమిటంటూ వైస్ చైర్పర్సన్ జరజాపు దీప్తి, కౌన్సిలర్లు.. మున్సిపల్ అధికారులపై ధ్వజమెత్తారు. మున్సిపల్ షాషింగ్ కాంప్లెక్స్లో 20వ నెంబరు షాపును వారు గురువారం పరిశీలించారు. ఈ షాపు ఖాళీగా ఉన్నట్టు రికార్డులో చూపితే తాళాలు ఎవరు వేశారని వారు ప్రశ్నించా రు. దీనికి మున్సిపల్ మేనేజర్ రాఘవాచార్యులు, ఆర్ఐ శ్రీనివాసరావు తమ వద్ద ఆ షాపు తాళాలు లేవని సమాధానమిచ్చారు. షాపుపై ఉన్న నెంబర్కు ఫోన్ చేసి, మేనేజర్ రాఘువాచార్యులు వివరాలు కనుగొన్నారు. ఈ షాపు 2017 నుంచి ఓ వ్యక్తి స్వాధీనంలో ఉంటే ఇప్పటివరకు ఎందుకు అద్దె వసూలు చేయలేదని కౌన్సిలర్లు మండిపడ్డారు. అధికారుల వల్లే మున్సిపల్ ఆదాయానికి గండి పడుతున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల అద్దె డబ్బులు అధికారుల జీతాల నుంచి వసూలు చేసేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేస్తామని హెచ్చరించారు. ఆ దుకాణంలో ఉన్న నిర్వాహకుడి సామగ్రి తీసుకెళ్లకుండా అధికారులు తాళాలు వేశారు. నిర్వాహకుడికి నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇదే అంశంపై సాలూరు మున్సిపల్ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధికారులను పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఆ షాపు తాళాల్లేవని చెప్పిన అధికారులు సాయంత్రం ఉన్నాయంటూ రమ్మని తమను పిలవడం విడ్డూరంగా ఉందని కౌన్సిలర్ గిరి రఘు అన్నారు.
Updated Date - Mar 08 , 2024 | 12:01 AM