పల్స్ పోలియోకు విశేష స్పందన
ABN, Publish Date - Mar 04 , 2024 | 01:19 AM
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయానికి 97.12 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయానికి 97.12 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,08,163 మంది చిన్నారులకు పోలియోచుక్కలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 97.12 శాతంతో 2,02,178 మంది చిన్నారులకు అందించారు. మిగిలిన చిన్నారులకు నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో అందించేలా ఏర్పాట్లు చేశారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పల్స్ పోలియో విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఎస్.జీవన్రాణి, ప్రొగ్రామ్ అధికారులు, డెమో బి.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2024 | 01:19 AM