ఉగాండా టు భారత్
ABN, Publish Date - Mar 08 , 2024 | 12:03 AM
ఉగాండా దేశం నుంచి మౌంటేన్ మంకీస్(ఆఫ్రికాబ్రీడ్ కోతులు)ను అసోం మీదుగా చెన్నైకు అక్రమంగా తరలిస్తుండగా.. ముగ్గురు కోల్కతా వాసులు కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు ఇచ్ఛాపురం చెక్పోస్టు వద్ద పట్టుబడ్డారు.
- ఆఫ్రికా బ్రీడ్ కోతుల అక్రమ రవాణా
- వాహనంలో అసోం మీదుగా చెన్నైకు..
- ఇచ్ఛాపురం వద్ద అటవీశాఖ తనిఖీలు
- పట్టుబడిన ముగ్గురు కోల్కతా వాసులు
పలాస, మార్చి 7: ఉగాండా దేశం నుంచి మౌంటేన్ మంకీస్(ఆఫ్రికాబ్రీడ్ కోతులు)ను అసోం మీదుగా చెన్నైకు అక్రమంగా తరలిస్తుండగా.. ముగ్గురు కోల్కతా వాసులు కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు ఇచ్ఛాపురం చెక్పోస్టు వద్ద పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి కాశీబుగ్గ అటవీశాఖ అధికారి ఎ.మురళీకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉగాండా దేశానికి చెందిన రెండు కోతులను అంతర్జాతీయ స్మగ్లర్ల ముఠా మన దేశానికి తీసుకువచ్చి అసోంలో కోల్కతాకు చెందిన బ్రోకర్లకు అప్పగించారు. అక్కడ నుంచి కోతులను ఇన్నోవా వాహనంలో ప్రత్యేక బోనులో చెన్నై తరలిస్తున్నారు. ఇచ్ఛాపురం వద్ద సాధారణ తనిఖీ చేస్తున్న అటవీ సిబ్బందికి కోతులు కనిపించాయి. వాటి కోసం ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో వాహనంలో ఉన్న సారబ్మండల్, ధనుజంయ్సింగ్, ముఖేష్రామ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురినీ కాశీబుగ్గ రేంజ్ కార్యాలయానికి తరలించి వణ్యప్రాణుల అక్రమ రవాణాచట్టం కింద కేసు నమోదు చేసారు. కోతులను తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. ఆఫ్రికా కోతులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వాహనంలో ఉన్న ఏసీలో ఉంచి ఆహారం, నీరు అందించారు. వాటిని విశాఖపట్నం జంతుప్రదర్శనశాలకు తరలించారు. గతంలో కూడా పలాస వద్ద అరుదైన మూగజీవాలు అలుదులను ఒడిశా నుంచి స్మగ్లర్లు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకొని వాటిని అడవిలో విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
Updated Date - Mar 08 , 2024 | 12:03 AM