గంజాయి రవాణాకు కేరాఫ్ సిక్కోలు
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:21 AM
గంజాయి రవాణాకు సిక్కోలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. రాష్ట్రంలో ఏ మూలకు గంజాయి తరలించాలన్నా.. సిక్కోలు మీదుగా దాటించాల్సిందే. స్కూటీ నుంచి కంటైనర్ల దాకా.. ఇటు హైవేతోపాటు అటు రైల్వేమార్గాల ద్వారా రవాణా సాగుతోంది
- జిల్లా మీదుగానే ఇతర ప్రాంతాలకు తరలింపు
- ఎన్నికల వేళ నిఘా పెరగడంతో పట్టుబడుతున్న నిల్వలు
(శ్రీకాకుళం క్రైం)
గంజాయి రవాణాకు సిక్కోలు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. రాష్ట్రంలో ఏ మూలకు గంజాయి తరలించాలన్నా.. సిక్కోలు మీదుగా దాటించాల్సిందే. స్కూటీ నుంచి కంటైనర్ల దాకా.. ఇటు హైవేతోపాటు అటు రైల్వేమార్గాల ద్వారా రవాణా సాగుతోంది. చెక్పోస్టులు, పోలీసుల పటిష్ట భద్రత, నిఘా నేత్ర వలయాలను దాటుకుంటూ జాతీయ రహదారి మార్గం గుండా విశాఖకు గంజాయి నిల్వలు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సినిమాల్లో మాదిరి పాలవ్యాను మొదలుకొని అత్యవసర వాహనాల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు.
- మూడేళ్లలో 50కు పైగా కేసులు
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు విశాఖ జిల్లాలో అరకు, పాడేరు నుంచి మాత్రమే గంజాయి రవాణా అయ్యేది. ఇప్పుడు ఒడిశా రాష్ట్రం నుంచి ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన పర్లాఖిముడి, పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, గొప్పిలి, మందస, కంచిలి, బరంపురం-ఇచ్ఛాపురం మీదుగా అధిక మొత్తంలో జిల్లాలోని జాతీయ రహదారి మీదుగా(ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకు) రవాణా సాగుతోంది. గంజాయి నియంత్రణలో భాగంగా పోలీసులు గడిచిన మూడేళ్లలో (2021-2023) 50కు పైగా కేసులు నమోదు చేశారు. గంజాయి రవాణాదారులను అదుపులోకి తీసుకుని.. భారీస్థాయిలో నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నెలరోజుల కిందట జిల్లాలో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసి.. గస్తీ ముమ్మరం చేశారు. ఈక్రమంలో జిల్లాలో రోజూ ఏదో ఒక చోట గంజాయి నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి.
- యువతే లక్ష్యంగా..
యువత, నిరుద్యోగులే లక్ష్యంగా గంజాయి సరఫరా సాగిస్తున్నారు. కొంతమంది యువత గంజాయి మత్తులో దొంగతనాలు, దాడులతోపాటు హత్యలకు కూడా వెనుకాడడం లేదు. చీకటి పడిందంటే యువకులంతా గుంపులుగా జిల్లాలోని రహస్య ప్రాంతాలకు చేరుకుని గంజాయి సేవిస్తున్నారు. అర్ధరాత్రి గంజాయి మత్తులో రోడ్లపై పడి అడ్డొచ్చిన వారిని చితగ్గొట్టడం, డబ్బులు లాక్కోవడం చేస్తున్నారు. 2022 ఏప్రిల్లో శ్రీకాకుళం సబ్డివిజనల్ కార్యాలయం వెనుక గూనపాలెంలో పట్టపగలు కరణ్ రాజ్ అనే యువకుడిని ఆరుగురు యువకులు గంజాయి మత్తులో గొడ్డలి వేటుతో హతమార్చారు. ఈ ఘటనను ఇప్పటికీ సిక్కోలు వాసులు మరిచిపోలేరు. గత ఎస్పీ అమిత్బర్దర్ హయాంలో వన్టౌన్, టూటౌన్ పోలీసుస్టేషన్ల పరిధిలో 20మందికిపైగా గంజాయి మత్తుకు బానిసైన యువకులను పిలిచి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
కేరళ తరలిస్తూ.. ఇద్దరి అరెస్టు
ఇచ్ఛాపురం, మార్చి 03 : కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేశారు. వాటిని ప్రయాణికుల ముసుగులో కేరళ తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇచ్ఛాపురం పోలీసులు వారిని అరెస్టు చేసి.. 15.60 కేజీల గంజాయి మూటలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఇచ్ఛాపురంలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాకు చెందిన కుట్టన్నాదర్ సత్యన్, శిబు దాసన్ ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రైలు మార్గంలో కేరళ తరలించేందుకు ఇచ్ఛాపురం చేరుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలోని బంగ్లారోడ్డులో వారు గంజాయి మూటలతో ఉన్నట్టు సమాచారం అందింది. రూరల్ ఎస్సై లక్ష్మణ్తోపాటు టౌన్ సిబ్బంది కలిసి వారి వద్ద బ్యాగులు తనిఖీ చేశారు. రెండు బ్యాగుల్లో 15.60 కేజీల గంజాయి పట్టుబడింది. వారిద్దరినీ అరెస్టు చేశామని సీఐ తెలిపారు.
Updated Date - Mar 04 , 2024 | 12:21 AM