రోజా తాయిలాలు!
ABN, Publish Date - Mar 08 , 2024 | 04:07 AM
ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక తాయిలాల పంపిణీకి అడ్డంకులుంటాయని భావించారో ఏమో.. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా ఇప్పుడే తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
మహిళా టీచర్లకు చీరలు, కానుకలు
అంగన్వాడీ, మెప్మాలకు కూడా
అందరికీ స్వీట్లు, గిఫ్ట్ బాక్సులుఎన్నికల షెడ్యూల్కు ముందే రోజా తాయిలాలు!
తిరుపతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక తాయిలాల పంపిణీకి అడ్డంకులుంటాయని భావించారో ఏమో.. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా ఇప్పుడే తాయిలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గురువారం పుత్తూరులోని షాదీ మహల్కు నియోజకవర్గంలోని ఉమెన్స్డే సందర్భంగా ప్రభుత్వ మహిళా టీచర్లందరినీ రప్పించారు. వారికి చీరలు, గిఫ్ట్ బాక్సులు అందజేశారు. హాజరు కాని ఉపాధ్యాయినులపై చర్యలుంటాయని అధికారులు బెదిరించడంతో వారంతా తరలివచ్చారు. అలాగే బుధవారం నగరిలోని తన నివాసానికి నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులను కుటుంబాలతో సహా రోజా ఆహ్వానించారు. ఎందుకు పిలిచారో తెలిసినందున కొందరు విలేకరులు ముఖం చాటేశారు. మరికొందరు మాత్రం వెళ్లారు. వారికి మంత్రి టిఫిన్ పెట్టించి.. పంచె, టవల్, చీర, స్వీట్ బాక్సు, గిఫ్ట్ బాక్సు అందజేశారు. నగదు కవర్లు కూడా అందజేశారని ప్రచారం జరుగుతోంది. మెప్మా, వెలుగు సిబ్బందిని కూడా ఆహ్వానించి చీరలు, గిఫ్ట్ బాక్సులు, స్వీట్ బాక్సులతో పాటు సెంటిమెంటుగా గాజులు కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఎన్నికలవేళ మద్దతు కోసం మంత్రి పడరాని పాట్లు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Mar 08 , 2024 | 04:07 AM