పొగాకు బోర్డు వైస్ చైర్మన్గా గుత్తా
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:07 AM
భారత పొగాకు బోర్డు వైస్ చైర్మన్గా ఒంగోలుకు చెందిన వ్యాపారి గుత్తా వాసుబాబు ఎన్నికయ్యారు. గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
వ్యాపారుల కోటాలో అవకాశం
పాలక మండలి సమావేశంలో ఎన్నిక
చైర్మన్, వైస్ చైర్మన్ రెండూ దక్షిణాదికే
కర్ణాటకలో 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి
ఒంగోలు, ఫిబ్రవరి 16 (ఆంఽధ్రజ్యోతి) : భారత పొగాకు బోర్డు వైస్ చైర్మన్గా ఒంగోలుకు చెందిన వ్యాపారి గుత్తా వాసుబాబు ఎన్నికయ్యారు. గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జడ్పీ మాజీ చైర్మన్, ప్రముఖ పొగాకు వ్యాపారి దివంగత గుత్తా వెంకటసుబ్బయ్య కుమారుడైన వాసుబాబు ఆ వ్యాపారంలో కొనసాగుతున్నారు. బోర్డులో వ్యాపారుల ప్రతినిధుల కోటాలో 2022 సెప్టెంబరులో డైరెక్టర్గా నియమితులైన ఆయన ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. బోర్డు చైర్మన్ను కేంద్రం నియామకం చేస్తుండగా వైస్ చైర్మన్గా పాలకమండలిలో ఉండే రైతు, వ్యాపార ప్రతినిధులకు రోటే షన్ పద్ధతిలో అవకాశం వస్తుంది. అయితే మూడు విడతలుగా రైతు ప్రతినిధులే ఎన్నిక అవుతుండగా ఇప్పటివరకు కర్ణాటకకు చెందిన వ్యక్తి ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో శుక్రవారం జరిగిన పాలక మండలి సమావేశంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈసారి కూడా తమ ప్రతినిధికే అవకాశం ఇవ్వాలని అది కూడా ఆంధ్ర ప్రాంతానికి కేటాయించాలని సమావేశంలో రైతు ప్రతినిధులు పట్టుపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం రైతు ప్రతినిధులుగా జిల్లాకు చెందిన వారే ముగ్గురు ఉండగా వారిలో బీజేపీకి చెందిన పొద ప్రసాదరావు, బ్రహ్మయ్యలు గట్టిగా ప్రయత్నించారు. వ్యాపారుల ప్రతినిధులు మాత్రం ఈ విడత తమకు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈక్రమంలో యువకుడైన గుత్తా వాసుబాబును వైస్చైర్మన్గా ఎన్నుకున్నారు. దీంతో కీలకమైన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండూ దక్షిణాదికే దక్కాయి. కందుకూరు నియోజకవర్గం నలదలపూడికి చెందిన చిడిపోతు యశ్వంత్కుమార్ ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతుండగా, ఇప్పుడు ఒంగోలు వాసి అయిన గుత్తా వాసుబాబు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే వాసుబాబు స్వగ్రామం కూడా కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెం కావడం విశేషం. వైస్ చైర్మన్గా ఎన్నికైన వాసుబాబును బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్, ఈడీ శ్రీధర్బాబు, సెక్రటరీ దివి వేణుగోపాల్, ఇతర అధికారులు, బోర్డు సభ్యులు అభినందించారు. ఇదిలా ఉండగా రానున్న ఏడాది (2024-25) కర్ణాటకలో పంట ఉత్పత్తి పరిమాణాన్ని కూడా ఈ సమావేశంలో ఖరారు చేశారు. రెండేళ్లుగా కర్ణాటకలో 100 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుతిస్తుండగా వచ్చే ఏడాది కూడా అలాగే అనుమతి ఇస్తూ శుక్రవారం నాటి బోర్డు సమావేశంలో తీర్మానించింది.
Updated Date - Feb 17 , 2024 | 01:07 AM