బాబ్బాబ్బాబు... మీరే దిక్కు!
ABN, Publish Date - Mar 03 , 2024 | 11:35 PM
వైసీపీ ఎన్నికల రాజకీయం అంతా వలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. వారికి ప్రోత్సాహక బహుమతుల పేరుతో ప్రభుత్వం ఇచ్చే నగదు పారితోషికంతోపాటు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులు భారీ తాయిలాలు ఇస్తున్నారు. కొందరు ఇప్పటికే డబ్బు పంపిణీ చేయగా, మరికొందరు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే మీ కుటుంబాలకు ఆరోగ్య బీమా పాలసీలు చేయిస్తామని, ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చే జీతం అంతా మీకే ఇస్తామని ఆశ చూపుతున్నారు. ప్రధానంగా ఒంగోలు లోక్సభ పరిధిలో ఈ వ్యవహారం బాగా నడుస్తోంది. ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ నేత సహకారం, ప్రోత్సాహం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘పార్టీ కోసం కష్టపడిన తమను పట్టించుకోకుండా వలంటీర్లపైనే అధారపడతారా! కానీయండి చూస్తాం!’ అంటూ ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
వలంటీర్ల చుట్టూ వైసీపీ రాజకీయం
ఇటు తాయిలాలు.. అటు హామీలు
ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున పంపిణీ
ఆరోగ్య బీమా పాలసీలు.. ఎమ్మెల్యే అయితే వచ్చే జీతం మీకేనంటూ మరో నేత హామీ
వారికి ఇవ్వండంటూ నియోజకవర్గానికి రూ.కోటి ప్రకారం పంపిన ఎంపీ అభ్యర్థి
వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి
కిందిస్థాయి నాయకుల్లో తిరుగుబాటు
వైసీపీ ఎన్నికల రాజకీయం అంతా వలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. వారికి ప్రోత్సాహక బహుమతుల పేరుతో ప్రభుత్వం ఇచ్చే నగదు పారితోషికంతోపాటు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులు భారీ తాయిలాలు ఇస్తున్నారు. కొందరు ఇప్పటికే డబ్బు పంపిణీ చేయగా, మరికొందరు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే మీ కుటుంబాలకు ఆరోగ్య బీమా పాలసీలు చేయిస్తామని, ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చే జీతం అంతా మీకే ఇస్తామని ఆశ చూపుతున్నారు. ప్రధానంగా ఒంగోలు లోక్సభ పరిధిలో ఈ వ్యవహారం బాగా నడుస్తోంది. ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ నేత సహకారం, ప్రోత్సాహం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ‘పార్టీ కోసం కష్టపడిన తమను పట్టించుకోకుండా వలంటీర్లపైనే అధారపడతారా! కానీయండి చూస్తాం!’ అంటూ ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను నమ్ముకొని ముందుకు సాగ డం గతం నుంచి జరుగుతోంది. అయితే ప్రసుత్తం అధికార వైసీపీ అందుకు భిన్నంగా వలంటీర్లను నమ్ముకుం ది. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు వలంటీర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఏనియోజకవర్గంలో చూసినా వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ కోసం పనిచేసేలా తాయిలాల ఎరచూపుతున్నారు.
ఎక్కువ మంది అభ్యర్థులు స్థానికేతరులే!
జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో స్థానికేతర అభ్యర్థులు వైసీపీ రంగంలోకి దింపింది. దీంతో వారు తూతూమంత్రంగా స్థానిక వైసీపీ శ్రేణులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించి వెంటనే వలంటీర్ల వైపు దృష్టి సారించారు. గతంలో ఒక ఊరికి వెళ్లాలన్నా, ఒక వార్డుకు వెళ్లాలన్నా ముందుగా ఆ ప్రాంతం నాయకులతో సంప్రదించే అభ్యర్థులు ఇప్పుడు ముం దుగా వలంటీర్లను కలుస్తున్నారు. ముఖ్యమంత్రి జగనే ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వపరంగా అధికారికంగా వలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేయించి వారిని సన్మానించడం, అవార్డుల పేరుతో నగదు బహుమతులు ఇవ్వడం చేయించారు. అంతటితో ఆగకుండా రాజకీయ పరమైన సమావేశాలకు కూడా శ్రీకారం పలికారు. వలంటీర్లు వారి పరిధిలోని ఓటర్ల సమాచారం తెలుసుకునేందుకే పరిమితం కాకుం డా మీరే అంతా చూ డాలంటూ వారిపై భారం మో పడం ప్రారంభించారు. అందుకు అనుగుణంగా వారికి తాయిలాలు కూడా పంచుతున్నారు.
ఒక్కో వలంటీర్కు రూ.5వేలు
వైసీపీ తరఫున పోటీలోకి దిగనున్న పార్టీ ఇన్చార్జిలు ప్రతి వలంటీర్కు రూ.5వేల ప్రకారం పంపిణీకి శ్రీకారం పలికారు. ఈ వ్యవహారం ఒంగోలు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే కొండపి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పంపిణీ పూర్తయ్యింది. కొండపిలో ఒక వలంటీర్కు రూ.5వేల ప్రకారం ఇవ్వడంతోపాటు ఇదే తరహాలో సచివాలయ ఉద్యోగులను కూడా గౌరవిస్తామంటూ సంకేతం పంపినట్లు తెలిసింది. ఒకట్రెండు గ్రామాల్లో వారికి కూడా నగదు అందించినట్లు కూడా తెలిసింది. మార్కాపురంలో అయితే పోటీ చేయబోతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు బొమ్మతో ఇచ్చిన గిఫ్ట్ ప్యాకెట్లో స్వీట్తోపాటు డబ్బులు పంపిణీ చేశారు. ఈ తంతు మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు పూర్తయ్యింది. దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ప్రతి వలంటీర్ కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలుకు అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాక తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని నెలకు ఒక మండలంలోని వలంటీర్లకు కేటాయిస్తానని ప్రకటించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఒంగోలులో అయితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం జరిగిన వలంటీర్ల సమావేశంలో ఎమ్మెల్యే బాలినేని మాట్లాడుతూ పేదలకు ఇంటి స్థల పట్టాతోపాటు శుభసూచికంగా ఒక చీర, ప్యాంటు, షర్టు ఇస్తానని ప్రకటించారు. కొంతకాలం క్రితం ఆయన వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు వార్డుల వారీ విందు కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు కూడా ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థులుగా మంత్రి సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, రాంబాబు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వలంటీర్లకు డబ్బుల పంపిణీ పూర్తయ్యింది. కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో రంగంలో కొచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు వలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ తాము చేయబోయే సహకారం గురించి వారికి చెప్పి తదనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
నియోజకవర్గానికి రూ.75 లక్షలు పైమాటే
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం వలంటీర్లకు ఇస్తున్న నగదే సరాసరి రూ.75 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చెప్పున ప్రతి నియోజకవర్గంలో 1,500 నుంచి 2వేల మంది వరకు వలంటీర్లు ఉన్నారు. సరా సరిన 1,500 మందికి ఒక్కొక్కరికి రూ.5వేల ప్రకారం ఇచ్చినా రూ.75 లక్షలు అందుకోసమే వినియోగిస్తున్నారు. ఒంగోలు లోక్సభ పరిధిలో ఈ వ్యవహారం అధికంగా జరగడానికి పార్టీ తరఫున ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఆర్థిక ప్రోత్సాహమే కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికీ రెండు నియోజకవర్గాలు మినహా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.కోటి ప్రకారం ఆయన పంపినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు వలంటీర్లకు తాయిలాలుగా ఇవ్వాలని ఆయన సూచించినట్లు వినికిడి.
రగిలిపోతున్న వైసీపీ శ్రేణులు
అనునిత్యం పార్టీ జెండా మోయడమే కాక పోలింగ్ సమయంలో కీలకపాత్ర పోషించే మమ్మల్ని పట్టించుకోకుండా వలంటీర్ల చుట్టూ తిరగడాన్ని చూసి వైసీపీలోని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. ‘వారికి నెలవారీ ఎంతో కొంత జీతం ఇస్తున్నారు. అన్నింటికీ మించి వలంటీర్లకు ఉద్యోగాలు మా సిఫార్సు మేరకే ఇచ్చారు. ఇప్పటికీ వారు మా పరిధిలోనే, మా అడుగుజాడల్లోనే ఉంటారు. అలాంటి వారికి మాతో సంబంధం లేకుండా తాయిలాలు అందజేయడం, అతిథి మర్యాదలు ఇవ్వడం, ఎన్నికల్లో మీరే బాధ్యులంటూ నాయకులు మాట్లాడటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం’ అని గ్రామస్థాయిలోని వైసీపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ‘గత నాలుగున్నర సంవత్సరాలుగా మా బాగోగులు పట్టించుకోని నాయకులు వస్తే నిలదీద్దామనుకున్నాం. కానీ జగన్ తెలివిగా వేరే వారిని పంపారు. అయినా వారితో మా సంగతేంటి చెప్పండని కోరాలనుకున్నాం. కానీ మమ్మల్ని కాదని వారు నేరుగా వలంటీర్లతో మమేకమయిపోయారు. రేపు మాసత్తా చూపిస్తాం’ అని కిందిస్థాయిలోని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Updated Date - Mar 03 , 2024 | 11:35 PM