తాడిపత్రిలో వైసీపీ కవ్వింపు చర్యలు
ABN, Publish Date - Mar 03 , 2024 | 03:02 AM
అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని పెన్నానదిలో జరుగుతున్న తాగునీటి సరఫరా పైపులైన్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు వెళ్లిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిని వైసీపీ వర్గీయులు దూషిస్తూ.. అడుగడుగునా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
తాగునీటి పైప్లైన్ పనుల పరిశీలనకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి
అరుపులు.. కేకలు వేస్తూ.. దూషిస్తూ వెంబడించిన వైసీపీ వర్గీయులు
తాడిపత్రి, మార్చి 2: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని పెన్నానదిలో జరుగుతున్న తాగునీటి సరఫరా పైపులైన్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు వెళ్లిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిని వైసీపీ వర్గీయులు దూషిస్తూ.. అడుగడుగునా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా పైప్లైన్ మరమ్మతు పనులను అధికారులు చేపట్టారు. ఆ పనులను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్లు, పలువురు కార్యకర్తలు శనివారం వెళ్లారు. వైసీపీ వర్గీయులు బాబా, తేజ తదితరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అరుపులు, కేకలు వేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డిని వెంబడించారు. ‘ఇక్కడికెందుకు వస్తున్నారు..? ఇక్కడ మీకేం పని?’ అని జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారికి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా.. సంయమనం పాటించాలని ప్రభాకర్ రెడ్డి సూచించడంతో మౌనం వహించారు. పోలీసులు అక్కడికి వచ్చి వైసీపీ శ్రేణులను అదుపుచేశారు.
Updated Date - Mar 03 , 2024 | 08:08 AM