శివారు చేలకు నీరు
ABN, Publish Date - Mar 03 , 2024 | 12:07 AM
జిల్లాలో దాళ్వా వరి సాగులో భాగంగా డ్రెయిన్లలో వృథాగా పోయే నీటికి అడ్డుకట్టలు వేసి శివారు ప్రాంతాల్లోని పంట చేలకు పూర్తిస్థాయిలో నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా డ్రెయిన్లపై క్రాస్బండ్ల నిర్మాణానికి, ఇంజన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక అందించామని కలెక్టర్ హిమాన్షుశుక్లా చెప్పారు.
అమలాపురం టౌన్, మార్చి 2: జిల్లాలో దాళ్వా వరి సాగులో భాగంగా డ్రెయిన్లలో వృథాగా పోయే నీటికి అడ్డుకట్టలు వేసి శివారు ప్రాంతాల్లోని పంట చేలకు పూర్తిస్థాయిలో నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా డ్రెయిన్లపై క్రాస్బండ్ల నిర్మాణానికి, ఇంజన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిక అందించామని కలెక్టర్ హిమాన్షుశుక్లా చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే క్రాస్ బండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 6న ఉదయం 7 గంటల నుంచి జిల్లాలోని అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులను ఒకేసారి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. ఫొటోతో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు త్వరితగతిన పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 16న నేషనల్ ఇమ్యునైజేషన్ డేను పురస్కరించుకుని ఈ నెల 3న జిల్లా అంతటా ఐదేళ్లలోపు పిల్లలకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్అజయ్, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకరప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.చంటిబాబు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 03 , 2024 | 12:07 AM