‘రాజన్న’ నిధులు కామారెడ్డికి మళ్లిస్తారా?
ABN, First Publish Date - 2023-09-22T02:52:51+05:30
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
వేములవాడ ఆలయ నిధులు రూ.5 కోట్లు
తరలించాలన్న ఉత్తర్వులపై విపక్షాల ఫైర్
పలుచోట్ల కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
రేపు వేములవాడ బంద్కు బీజేపీ పిలుపు
దేవుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్: బండి
సర్కారు ఉత్తర్వులపై విపక్షాల ఆగ్రహం
వేములవాడ/హైదరాబాద్, సెప్టెంబరు 21: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేములవాడ రాజన్న ఆలయ నిధుల మళ్లింపు వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల దేవాలయాల అభివృద్ధికి వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం నిధుల నుంచి రూ.5 కోట్లు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి రూ.5 కోట్లు విడుదల చేయాలని ఆదేశిస్తూ దేవాదాయ శాఖ ఈనెల 13న ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే సర్కారు నిర్ణయంపై వేములవాడలో విపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా రాజన్న ఆలయం ఎదుట, పలుచోట్ల గురువారం సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. నిధుల మళ్లింపును నిరసిస్తూ ఈనెల 23న వేములవాడ బంద్ పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. రాజన్న ఆలయం నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి నిధుల మళ్లింపును అడ్డుకుని తీరుతామని బీజేపీ సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అవసరాల కోసం రాజన్న ఆలయం నిధులను మళ్లించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ సైతం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. నిధుల మళ్లింపు ఆలోచన సరైంది కాదని, సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న కారణంతో కామారెడ్డికి వేములవాడ నుంచి నిధుల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై జాయింట్ యాక్షన్ కమిటీ నేతలతో చర్చించి పోరాటానికి దిగుతామని ప్రకటించారు.
దేవుళ్లను మోసం చేస్తున్న కేసీఆర్: సంజయ్
స్వార్థ రాజకీయాల కోసం సీఎం కేసీఆర్.. సాక్షాత్తు దేవుళ్లను కూడా మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ దేవస్థానానికి ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠగోపం పెట్టారని ధ్వజమెత్తారు. ఆలయానికి నయాపైసా ఇవ్వకుండా రాజన్నకు భక్తులు సమర్పించిన కానుకల నుంచి కామారెడ్డికి నిధులు మళ్లించాలనుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.ఓట్లు దండుకునేందుకు కామారెడ్డి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కామారెడ్డి అభివృద్ధికి నిధులు కేటాయించాలనుకోవడంలో అభ్యంతరం లేదని, మరి మిగిలిన నియోజకవర్గాల సంగతేంటని ప్రశ్నించారు.
Updated Date - 2023-09-22T02:52:51+05:30 IST