పథకాలన్నీ ఆపమంటారేమో?
ABN, First Publish Date - 2023-10-27T03:15:21+05:30
రైతుబంధు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అన్నదాతల పాలిట నంబర్ వన్ విలన్ అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అన్నదాతల పాలిట విలన్
అక్కసుతోనే రైతు బంధు ఆపాలని లేఖ
ఇలాంటి కుట్రలను రైతాంగం భరించదు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి
ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలి: కేటీఆర్
బీఆర్ఎస్ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. అన్నదాతల పాలిట నంబర్ వన్ విలన్ అని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుట్రలను అన్నదాతలకు వివరించాలని, గ్రామ స్థాయి నుంచి నిరసన తెలపాలని సూచించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మలు చేయడంతోపాటు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రైతు విరోధి అని మరోసారి రుజువైందని, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ శ్రేణులతో గురువారం టెలికాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కొనసాగుతున్న రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం.. అక్కసు తప్ప మరొకటి కాదని అన్నారు. ఇప్పటికే 11సార్లు పంట సీజన్లకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సాయం అందించామని, ఎన్నికల కోడ్ పేరిట సాయం ఆపాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కోడ్ పేరు చెప్పి ప్రభుత్వం అందిస్తున్న ఇంటింటికి మంచినీళ్లు ... 24 గంటల కరెంటును కూడా ఆపెయ్యమంటారేమో? అని వ్యంగ్యంగా అన్నారు. అన్నదాతల పొట్టకొట్టేలా కాంగ్రెస్ చేస్తున్న కుతంత్రాలను, పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కుట్రలను తెలంగాణ రైతాంగం భరించదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని జనంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎ్సలోకి మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి
హైదరాబాద్ : పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి బీఆర్ఎ్సలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ వెంట నడిచేందుకే తాను బీఆర్ఎ్సలో చేరినట్లు ఈ సందర్భంగా మోహన్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-27T03:15:21+05:30 IST