దొంగలెవరో..?!
ABN, First Publish Date - 2023-06-11T00:05:53+05:30
కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో చోటుచేసుకున్న భారీ చోరీ మిస్టరీ ఇంకా వీడటం లేదు. రూ. రూ.82.32 లక్షల విలువైన సామగ్రి అపహరణ వెనుక ఉన్నదెవరో అంతుచిక్కడం లేదు.
మిస్టరీ వీడని కేటీపీపీ చోరీ వ్యవహారం
రూ.82 లక్షల యంత్ర సామగ్రి అపహరించింది ఎవరనే విషయంపై కార్మికుల్లో చర్చ
మహిళా అధికారితో పాటు ఓ పెద్ద సారు సతీమణి పాత్రపై అనుమానం
విచారణ చేపడుతున్న విజిలెన్స్ విభాగం
పక్కదోవ పట్టించేందుకు ముమ్మరంగా ప్రయత్నం
భూపాలపల్లి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో చోటుచేసుకున్న భారీ చోరీ మిస్టరీ ఇంకా వీడటం లేదు. రూ. రూ.82.32 లక్షల విలువైన సామగ్రి అపహరణ వెనుక ఉన్నదెవరో అంతుచిక్కడం లేదు. దొంగలెవరో తేలడం లేదు. చోరీ చేసిందెవరు.. ఇంటి దొంగలా.. బయట వ్యాక్తులా? అనే చర్చ కార్మికుల్లో జోరుగా సాగుతోంది. కేటీపీపీలోని ఓ పెద్దసారు సతీమణి అండదండలతో మరో మహిళా అధికారి కనుసన్నుల్లోనే ఈ వ్యవహరం సాగిందనే ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ విచారణను సైతం పక్కదారి పట్టించేందుకు ఆ ఉన్నతాధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బందిని బలి చేసి. కేసును మూసి వేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
కేటీపీపీలో సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి పంపరు. చీమ కూడా దూరలేని భద్రత ఇక్కడ ఉంటుంది. అంతటి పకడ్బందీ సెక్యూరిటీ ఉండగా కేటీపీపీలో లక్షల విలువైన సామగ్రి ఎలా మాయమైందనేదే ప్రశ్నార్థం. కనీసం మీడియాకు కూడా కేటీపీపీలోనికి అనుమతి లేదు. లోపల ఏం జరుగుతుందో అందులో పనిచేసే ఉద్యోగులకు తప్ప బయటి ప్రపంచానికి తెలియకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అలాంటి ఈ కేటీపీపీలో రూ.82.32 లక్షల విలువైన టర్బైన్, బాయిలర్, జనరేటర్, బ్యాటరీలు, బేరింగ్స్, వాల్స్, కాపర్ తదితర యంత్ర పరికాల సామగ్రి మాయం కావటం చర్చనీ యాంశంగా మారింది. గత సోమవారం ఈ ఘటన వెలుగులోకి రావటంతో జెన్కో ఉన్నతాధి కారులు అలెర్ట్ అయ్యారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై ఫైర్ కావటంతో హుటాహుటిన గణపురం పోలీసు స్టేషన్లో కేటీపీపీ అధికారులు చోరీ జరిగినట్టు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రాకపోతే లోలోనే మమ అనిపిం చే వారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువా రం విజిలెన్స్ అధికారుల బృందం కేటీపీపీలో విచారణ చేపట్టింది. అయితే... ఏం తేల్చకుండానే విజిలెన్స్ అధికా రులు హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాం శంగా మారింది. దీంతో కేటీపీపీలో చోరీ ఇంకా మిస్టరీగానే మిగిలింది.
సీసీ కెమెరాలు ఏమయ్యాయి..?
కేటీపీపీలో మొదటి, విడతలో 500 మెగావాట్లు, రెండో విడతలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుతోంది. దీనికి ఎలాంటి ఆటంకాలు ఎదరుకాకుండా ముందస్తుగానే ఆయా విభాగాల్లో కావాల్సిన పరికరాలను స్టోరీ చేస్తారు. దీని కోసం కేటీపీపీలో ఆరు స్టోర్ షెడ్లు ఉన్నాయి. ఎంతో విలువైన పరికరాలను భద్రతను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఇక్కడ కరువయ్యాయి. ఈ స్టోర్ షెడ్లకు కేవలం ముందు భాగంలో మాత్రమే సీసీ కెమె రాలు ఉన్నాయి. వెనుక భాగంలో చెట్ల పొదలు, చెరువుకట్ట లాంటివి ఉ న్నాయి. దొంగతనాలు జరి గేందుకు అనువైన వాతా వరణం వెనుక వైపే ఉంది. అక్కడ మాత్రం సీసీ కెమెరా లు లేవు. విజిలెన్స్ అధికారులు ముందు వైపు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని మాత్రమే పరిశీలించారు. సెక్యూరిటీ టీమ్ను పలు ప్రశ్నలు వేసినట్టు సమాచారం. అసలు దొంగతనాలు జరిగేందుకు అనువైన వాతావరణం ఉన్న షెడ్ల వెనుక భాగంలో సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదనే దానిపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతోపాటు స్టోర్ రూమ్లో ఎప్పటికప్పుడు స్టాక్ను చెక్ చేయాల్సిన బృందం ఏం చేస్తోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వందలాది మంది సెక్యూరిటీ సిబ్బంది, విధుల్లో ఉండే కార్మికుల కళ్లుగప్పి విలువైన సామగ్రిని మాయం చేయటం ఎలా సాధ్యమైందనే చర్చ కూడా జరుగుతోంది.
ఇంటి దొంగలపైనే అనుమానాలు?
ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్న కేటీపీపీలో చోరీ బయటి వ్యక్తుల కాదని, ఇది ఇంటి దొంగల పనే అనే చర్చ జరుగుతోంది. కొన్నే ళ్లుగా కేటీపీపీలో గప్చుప్గా యంత్ర సామగ్రి చోరీతో పాటు ఆయిల్ మార్పిడి దందా సాగు తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాల వెనుక కేటీపీపీలోని ఓ ఉన్నతాధికారి సతీమణి పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.82.32 లక్షల యంత్ర సామగ్రి మాయం కావటం సామా న్యమైన విషయం కాదని, కేటీపీపీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉన్నతాధికారి ప్రమేయం ఉందనే చర్చ కార్మిక వర్గా ల్లో సాగుతోంది. గతంలో చేసిన చోరీలు బయట పడ కపోవటంతో ఇన్నాళ్లు గట్టుచప్పుడు కాకుండా వ్యవ హారం నడిచిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. పెద్ద సారు సతీమణి పలుమార్లు స్టోర్ రూంల వద ్దకు రావటం, ఆ మహిళా ఉన్నతాధికారి సైతం పలు మార్లు ఆమెను కలవటంపై కింది స్థాయి ఉద్యోగుల కు అనుమానం వచ్చి బయటకు సమాచారం లీక్ చేశారనే చర్చ జరుగుతోంది. దీంతోనే ఈ కుంభకోణం బయటపడిందని తెలుస్తోంది. మహిళా అధికారితో పాటు తన సతీమణిని రక్షించుకునేందుకు ఆ ఉన్నతాధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే విజిలెన్స్ అధికారులను మాయ చేసేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. అయితే.. ఉన్నతాధికారులకు విజిలెన్స్ బృందం ఇచ్చే నివేదికలో ఏం ఉందనే ఉత్కంఠ నెలకొంది. వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.. లేక పెద్దసారు ప్రలోభాలతో కింది స్థాయి అమాయక ఉద్యోగులను బలి చేసి చేతులు దులుపుకుంటారా..? అనే చర్చ కార్మిక వర్గాల్లో సాగుతోంది.
Updated Date - 2023-06-11T00:05:53+05:30 IST