వడ్ల కొనుగోళ్లకు రెడీ
ABN, First Publish Date - 2023-10-25T23:54:06+05:30
జిల్లాలో వానాకాలం పండిన ధాన్యం సేకరణకు సమయం ఆసన్నమైంది.. మరో పది రోజుల్లో వరికోతలు ప్రారం భం కానున్న నేపధ్యంలో.. సంబంధిత అధికారులు వడ్ల కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. నవంబర్ మూడోవారం లేదా చివరివారంలో రైతుల నుంచి సేకరించనున్నారు. దీనికిగాను జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు ప్రణాళికను తయారు చేశారు. ఈసారి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది.
జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ధాన్యం టార్గెట్ 2.50 లక్షల మెట్రిక్ టన్నులు
నవంబర్ చివరి వారంలో సేకరణ ప్రారంభం
రైతుల ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి
మరో పదిరోజుల్లో వరికోతలు షురూ
మహబూబాబాద్ అగ్రికల్చర్, అక్టోబరు25 : జిల్లాలో వానాకాలం పండిన ధాన్యం సేకరణకు సమయం ఆసన్నమైంది.. మరో పది రోజుల్లో వరికోతలు ప్రారం భం కానున్న నేపధ్యంలో.. సంబంధిత అధికారులు వడ్ల కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. నవంబర్ మూడోవారం లేదా చివరివారంలో రైతుల నుంచి సేకరించనున్నారు. దీనికిగాను జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు ప్రణాళికను తయారు చేశారు. ఈసారి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది.
దిగుబడికి అనుగుణంగా ఏర్పాట్లు..
ఈ వానాకాలం సీజన్లో మహబూబాబాద్ జిల్లాలో 2.16 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. దానికి గాను 3.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. దిగుబడికి అనుగుణంగా జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్ విండోల ద్వారా 153, ఐకేపీ ద్వారా 64, జీసీసీ ద్వారా 11, ఇతర సంస్థల ద్వారా 6 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. గతేడాది ఇదే సీజన్లో 2.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, రబీలో 1.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఖరీఫ్ సీజన్కుగాను 3.37 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం దిగుబడి రానుండడంతో అందులో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ చేయాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. అందుకుగాను 60 లక్షల బస్తాలు అవసరం కానున్నాయి. 30 లక్షల బస్తాలు కొత్తవి కాగా, మరో 30 లక్షలు పాత బస్తాలే.
పెరిగిన మద్దతు ధర..
ఈ వానాకాలం సీజన్లో వరికి మద్దతు ధర పెరిగిం ది. క్వింటాపై రూ.143 వరకు పెరిగాయి. గత సీజన్లో ఏ గ్రేడ్ వరి రూ.2,060 కాగా, కామన్ రకం రూ.2,040 వరకు ఉంది. ఈసారి ఏ గ్రేడ్ రూ.2203 కాగా, కామన్ రకం రూ.2,183 వరకు ఉంది. దాంతో పెరిగిన మద్దతు ధరతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
బయోమెట్రిక్ ద్వారానే కొనుగోళ్లు..
ధాన్యం కొనుగోళ్లలో మధ్య దళారులకు చెక్పెట్టేందుకు రైతులే స్వయంగా ధాన్యం మద్దతు ధరతో అమ్ముకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేస్తోంది. పట్టాదారు పాస్పుస్తకం కలిగిన రైతు లు స్వయంగా వేలిముద్ర వేసి, ఆధార్ నెంబర్ నమోదుతోనే కొనుగోళ్లు చేపడుతారు.
ఈ సారి ట్రాన్స్పోర్టర్ల నిర్లక్ష్యం వీడేనా..!?
జిల్లాను ఐదు క్లస్టర్లుగా విభజించారు. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, మరిపెడ, తొర్రూరులను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క క్లస్టర్లకు లారీలను సరఫరా చేసేందుకు ఓ కాంట్రాక్టర్ను నియమించారు. ఒక కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు కాంట జరిగిన ధాన్యాన్ని ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకంవేసి రోజుల తరబడి లారీల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లారీలు రాకపోవడంతో కొన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులే స్వయంగా సొంత ఖర్చులు వేసుకుని ట్రాక్టర్లను కిరాయికి తీసుకుని రైస్మిల్లులకు ధాన్యం బస్తాలను తరలిస్తున్నారు. దాంతో రైతులు కొంతమేర ఆర్థికం గా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ సారైనా లారీలు సక్రమంగా తెప్పించి ధాన్యం బస్తాలను సకాలంలో మిల్లుకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో 234 కేంద్రాలు ఏర్పాటు : కృష్ణవేణి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్
జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ధాన్యం దిగుబడి ఆలస్యంగానే వస్తుండడంతో వచ్చేనెల చివరివారంలో ప్రారంభించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈసారి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. బయోమెట్రిక్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు ఆధార్కార్డుతో సెల్ఫోన్ నెంబర్ను ఈ కేవైసీ చేయించుకోవాలి.
Updated Date - 2023-10-25T23:54:06+05:30 IST