రుణమో రామచంద్రా!
ABN, First Publish Date - 2023-05-16T23:58:26+05:30
జిల్లాలో బీసీ కార్పొరేషన్ రుణాలు నిలిచిపోయాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2018 వరకు రుణాలు మంజూరైనప్పటికీ అప్పటి నుంచి జాడలేదు. దీంతో నిరుద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయి. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు ఎలాగూ రావడంలేదని, కనీసం స్వయం ఉపాధితో అయినా బతుకుదామని బీసీ కులాలకు చెందిన యువత నిరీక్షిస్తున్నారు. జనగామ జిల్లాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దాదాపుగా 13,017 పైగానే ఉంది.
జిల్లాలో నిలిచిపోయిన బీసీ కార్పొరేషన్ రుణాలు
ఐదేళ్లుగా నిరుద్యోగ యువత ఎదురు చూపులు
పెండింగ్లో 13,017 దరఖాస్తులు
పాలకుర్తి, మే 16 : జిల్లాలో బీసీ కార్పొరేషన్ రుణాలు నిలిచిపోయాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2018 వరకు రుణాలు మంజూరైనప్పటికీ అప్పటి నుంచి జాడలేదు. దీంతో నిరుద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయి. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు ఎలాగూ రావడంలేదని, కనీసం స్వయం ఉపాధితో అయినా బతుకుదామని బీసీ కులాలకు చెందిన యువత నిరీక్షిస్తున్నారు. జనగామ జిల్లాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దాదాపుగా 13,017 పైగానే ఉంది. జనాభాలో సగ భాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వేదికలపై ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. ఫెడరేషన్ పరిస్థితి కూడా దాదాపుగా అదే తీరుగా ఉంది. దీంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 13,017
జిల్లాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా రుణాల కోసం గత ఐదేళ్లుగా 13,017మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం కేటగిరి-1 రూ.1 లక్ష, కేటగిరి 2 కింద రూ.2 లక్షలలోపు, కేటగిరి 3 కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు ఇచ్చేవారు. ఇందులో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చేది. మిగతా సగం అభ్యర్థులు వాయిదాల రూపంలో చెల్లించేవారు. జనగామ జిల్లాలో యువతీ, యువకులు ఈ మూడు కేటగిరిల కింద మొత్తం 13,017 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా నయా పైసా అందలేదని నిరుద్యోగ యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి : దేవసాని వెంకటేశ్వర్లు, బమ్మెర
నిరుపేద అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసి ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు విడుదల చేసి ఆదుకోవాలి.
దరఖాస్తు చేసుకొని ఐదేళ్లవుతోంది : లొంక అశోక్, పాలకుర్తి మండలం తొర్రూరు
దరఖాస్తు చేసి ఐదేళ్లు అవుతోంది. ప్రభుత్వం నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తామని ఆశపెట్టి ఇంత వరకు ఇవ్వలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్ కింద రుణాలు ఇచ్చి ఆదుకుంటారని ఆశపడ్డాం. ఇంత వరకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయంలో సీఎం ఇప్పటికైనా స్పందించాలి.
ప్రభుత్వం మంజూరు చేస్తే రుణాలు ఇస్తాం : బి.రవిందర్, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి
జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించడానికి ఆసక్తి గల యువతీ, యువకుల వద్ద నుంచి 2018లో దరఖాస్తులు స్వీకరించాం. దరఖాస్తుల పరిస్థితిని ఉన్నతాధికారుల ద్వారా గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. రుణాల పంపిణీకి అవసరమైన నిధులు రావాల్సి ఉంది. ప్రభుత్వం రుణాలకు నిధులు మంజూరి చేస్తే లబ్ధిదారులకు అందజేస్తాం.
Updated Date - 2023-05-16T23:58:26+05:30 IST