ఏజ్బార్ అవుతోంది.. పర్మినెంట్ చేయండి సారు..
ABN, First Publish Date - 2023-03-05T23:42:37+05:30
ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సెకెండ్ ఏఎన్ఎంల ఆశలు అడియాసలే అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారిని పర్మినెంట్ చేయడం లేదు. మరోవైపు వయసు పైబడుతుండడంతో ఉద్యోగుల్లో అందోళన నెలకొంది.
సెకండ్ ఏఎన్ఎంల వేడుకోలు
జిల్లాలో 103 మంది ఉద్యోగులు
15 ఏళ్లుగా అందిస్తున్న వైద్య సేవలు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విన్నపం
రఘునాథపల్లి, మార్చి 5: ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సెకెండ్ ఏఎన్ఎంల ఆశలు అడియాసలే అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారిని పర్మినెంట్ చేయడం లేదు. మరోవైపు వయసు పైబడుతుండడంతో ఉద్యోగుల్లో అందోళన నెలకొంది. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు లేకపోవడంతో అటు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకువస్తున్నారు. వెంటనే జీవో నెం.18లో చేర్చి రెగ్యులరైజ్ చేయాలని వేడుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 104 హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 103 మంది సెకెండ్ ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. వీరు 2007-2010 మధ్యలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో భాగంగా విధుల్లో చేరారు. అయితే చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ తలరాత మాత్రం మారడం లేదని వాపోతున్నారు. కొందరి వయసు నాలుగు పదులు దాటుతున్నా మారుమూల ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా 2500 మందికి ఒక ఏఎన్ఎం ఉండాల్సి ఉండగా, నాలుగైదు వేల మంది జనాభాకు ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. అంతే కాకుండా ఒక్కొక్కరికి మూడు..నాలుగు గ్రామాలు కుడా ఉన్నాయి. వీరికి వచ్చే జీతంలోనే ఇతర గ్రామాలకు గంటల కొద్ది ఎండనక.. వాననక ఆటోల కోసం ఎదురుచూస్తూ మరీ వెళ్లాల్సి వస్తోంది..
పనులన్నీ వీళ్లతోనే..
ఆరోగ్య కార్యకర్తలుగా పిలిచే సెకెండ్ ఏఎన్ఎంలు ప్రభుత్వం అమలుచేసే పనులకు దగ్గరగా, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫలాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో రెగ్యులర్ వారితో సమానంగా పని చేస్తున్నారు. పైగా వీరిలో గర్భిణులకు మెటర్నిటీ సెలవులు, హెల్త్కార్డులు, ట్రావెలింగ్ అలవెన్స్, యూనిఫాం అలవెన్సులు మాత్రం అందవు. పూర్తి సమయం ఉద్యోగం చేస్తున్నా కూడా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని సెకెండ్ ఏఎన్ఎంలు వాపోతున్నారు.
పనికి తగ్గ వేతనమేది..?
ఆరోగ్య శాఖలో కీలకంగా విధులు నిర్వహించే బాధ్యత సెకెండ్ ఏఎన్ఎంలదే... ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి యోగ క్షేమాలను చూసుకోవాలి. కరోనా సమయంలో సైతం కుడా విధులు విజయవంతంగా నిర్వహించిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒక వైపు ఎన్సీడీ పరీక్షలు, సర్వేలు, కంటి వెలుగు తదితర పనులన్నీ రెగ్యులర్ వారితో సమానంగా చేస్తున్నా జీతం ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం వ్యత్యాసం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇచ్చే సాలరీలో తమకు సగం కూడా ఇవ్వడం లేదని, ప్రస్తుతం రూ.27వేలే ఇస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
15 ఏళ్లుగా పని చేస్తున్నా..: యం.యాదలక్ష్మి, సెకెండ్ ఏఎన్ం, వెల్ది
పదిహేను ఏళ్ల నుంచి సెకెండ్ ఏఎన్ఎంగా పని చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం అని చేరాను. కానీ ఇప్పటికీ రెగ్యులరైజ్ కాలేదు. దాదాపు 4 వేల మందికి వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నా. పని బారేడు.. జీతం మూరెడు అన్నట్లు ఉంది మా పరిస్థితి. పనికి తగ్గ వేతనం ఇవ్వక పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నతాధికారులు స్పందించాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.. : జి.సంధ్యారాణి, సెకెండ్ ఏఎన్ఎం, రఘునాథపల్లి
జీవో నెం.18లో సెకెండ్ ఏఎన్ఎంలను చేర్చడంతో పాటు వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం అందించాలి. చాలీచాలని జీతాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నాం. నిత్యావసర సరకుల ధరలు ఆకాశనంటుతుతున్నాయి. వాటికి అనుగుణంగా మా జీతాలు పెంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
Updated Date - 2023-03-05T23:42:37+05:30 IST