దైవదర్శనానికి వెళ్లొస్తూ మృత్యువాత
ABN, First Publish Date - 2023-06-02T02:41:01+05:30
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా శ్రీకాళహిస్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
దంతాలపల్లి, జూన్ 1 : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగొస్తుండగా శ్రీకాళహిస్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మహబూబాబాద్ జిల్లాలోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ఆరేళ్ల బాలిక సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన నెమ్మతి వెంకటమ్మ(62), తన కుమారులు నెమ్మతి అశోక్(32), దినేశ్ కన్నా(వెంకన్న), రాంబాబు, దినేశ్ కన్నా కూతుళ్లు బాన్వితాక్షరి(6), కన్నారి కలిసి మే 29న తిరుమలకు వెళ్లారు. అశోక్ అల్లుడి పుట్టువెంట్రుకల వేడుక కోసం తిరుపతి వెళ్లిన వీరంతా స్వామి వారిని దర్శించుకుని గురువారం తెల్లవారుజామున స్వగ్రామానికి కారులో బయలుదేరారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి సమీపంలోని మేర్లపాక చెరువు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అవ్వగా వెంకటమ్మ, అశోక్, బాన్వితాక్షరి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలతో బయటపడిన దినేశ్ కన్నా, రాంబాబు, కన్నారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దినేష్ చికిత్స పొందుతూ మరణించగా కన్నారి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు.
Updated Date - 2023-06-02T02:41:01+05:30 IST