కల్తీల జోరు.. కనిపెట్టకుంటే బేజారు
ABN, First Publish Date - 2023-06-26T00:59:54+05:30
వానాకాలం సాగు మొదలైంది. నకిలీల జోరు కూడా ఊపందుకోనుంది. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలులో బిజీ అయిపోతారు. ఇదే అదునుగా నకిలీల బెడద పొంచి ఉంది. సాగులో విత్తనాలు ఎరువుల ఎంపిక కీలకంకావడంతో కొనుగోలులో జాగ్రత్త లు తప్పనిసరి. లేకపోతే ఏడాది పడిన శ్రమంతా వృథా అవుతుంది. పెట్టిన పెట్టుబడి రాకుండా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.
బీబీనగర్: వానాకాలం సాగు మొదలైంది. నకిలీల జోరు కూడా ఊపందుకోనుంది. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలులో బిజీ అయిపోతారు. ఇదే అదునుగా నకిలీల బెడద పొంచి ఉంది. సాగులో విత్తనాలు ఎరువుల ఎంపిక కీలకంకావడంతో కొనుగోలులో జాగ్రత్త లు తప్పనిసరి. లేకపోతే ఏడాది పడిన శ్రమంతా వృథా అవుతుంది. పెట్టిన పెట్టుబడి రాకుండా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. పంటలు ఆ శించి న దిగుబడులు ఆశించాలంటే నాణ్యమైన విత్తనాలు అవసరంమేరకు ఎరువు లు ఉపయోగించాలి. వానాకలం ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు అధికారుల సలహాలు,శాస్త్రవేత్తల సూచనలు అవసరం.
వరి విత్తనాల ఎంపిక ఇలా..
సీలు వేసి ధ్రువపత్రం ఉన్న విత్తన బస్తాలనే తీసుకోవాలి.బస్తాపై విత్తన రకం, ల్యాబ్ నెంబర్,గడువు తేదీ తదితర వివరాలను ముద్రిస్తారు.వాటిని తెలుసుకోవాలి.
కొనుగోలు చేసిన బిల్లుపై తప్పనిసరిగా డీలర్ సంతకం ఉండాలి.
హైబ్రీడ్ విత్తనం కొనుగోలు చేసేటప్పుడు విత్తనం రకం, స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం జన్యుపరమైన నాణ్యత వంటి వివరాలను పరిశీలించాలి.
మొలకెత్తే దశ, పూత దశలో లోపం ఉన్నట్లు గమనిస్తే వెంటనే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
ఎంపికలో అప్రమత్తత అవసరం
అధికారులు సూచించిన పురుగు మందులనే వాడాలి.
లేబుల్ లేని మందు సీసాలు డబ్బాలు ప్యాకెట్లను కొనుగోలు చేయకూడదు.
మందు పేరు, రూపం, శాతం, పరిమాణం, జాగ్రత్తలు, విరుగుడు, తయారు చేసిన సంస్థ గడువు తేదీ రిజిస్ర్టేషన్ వివరాలను కొనుగోలు చేసే మందు పరిశీలించారు.
కొనుగోలుచేసిన డీలరు నుంచి సంతకం తీసుకోవాలి.
మందు సీసాలు డబ్బాలపై సీలు సక్రమం గా లేకుంటే కొనుగోలు చేయకూడదు.
లైసెన్స్ లేని డీలర్లు, సస్యరక్షణ మందుల ను విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారుల కు ఫిర్యాదు చేయాలి.
నకిలీలను గుర్తించండి ఇలా..
ధర తక్కువగా ఉండే పురుగు మందులు, రసాయన ఎరువులను ఎక్కువ ధర ఉండే పేరుతో అమ్ముతుంటారు. చలామనీలో ఉన్న ఎరువులు, పురుగు మందులను పోలి ఉండే లా నకిలీలను విక్రయిస్తుంటారు. తేమ ఉన్న, గడ్డకట్టిన వాటిలో నాణ్యతా ప్రమాణాలు, ఆకారంలో తేడాలు లోపిస్తాయి.
కల్తీ ఎరువుల గుర్తింపు..
చెమ్మగిల్లి ఉన్న ఎరువుల్లో ప్రామాణికం నాణ్యతలోపిస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పా ఎరువులోని గులికలన్నీ ఒకే రంగులో ఉంటాయి. అన్య పదార్థం ఎరువులో కనిపిస్తే దాన్ని కల్తీగా గుర్తించాలి.
యూరియా, కాల్షియం, అమోనియం నైట్రేట్, డీఏపీ ఇతర సంకీర్ణ ఎరువులు సాధారణంగా గులికల రూపంలో ఉంటాయి.
151515, 202020 రేణువుల రూపంలోనూ మ్యూరేట్ ఆఫ్ పోటాష్, పొటాషియం సల్ఫేట్ ఎరువులు పొడి రూపంలో ఉంటాయి. అలా లేకపోతే వాటిని కల్తీవిగా గుర్తించాలి.
యూరియా, అమోనియం సల్ఫేట్, జింక్ సల్ఫేట్ స్వచ్ఛమైనవేనా లేదా తెలుసుకోవాలంటే ఎరువును ఒక చెంచా తీసుకొని 5 మి.లీ. శుద్ధమైన నీటి (డిస్టల్డ్ వాటర్)లో కలిపితే స్వచ్ఛంగా ఉండాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అమోనియం ఫ్లోరైడ్ అయితే టీ స్పూన్ ఎరువును 10 మి.లీ నీటిలో వేసి బాగా కలిపితే ఆ నీరు స్వచ్ఛంగా ఉండాలి.
ఇవి పాటించాలి
లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలి.
కొనుగోలు చేసిన ఎరువులకు తగిన బిల్లు తీసుకోవాలి. దాన్ని జగ్రత్తగా భద్రపర్చాలి.
డీలర్ పుస్తకంలో విధిగా రైతులు సంతకం చేయాలి.
మిషన్ కుట్టు ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి.
చేతి కుట్టు ఉంటే దానిపై సీసం సీలు ఉందో లేదో గమనించాలి. బస్తాపై ఉత్పత్తిదారు వివరాలు ఉన్నదీ లేనిది గమనించాలి.
మేలు రకం విత్తనాలతోనే అధిక దిగుబడులు : దీప్తి, వ్యవసాయ అధికారి, బీబీనగర్
మేలు రకం విత్తనాలతో ఆశించిన దిగుబడులు వస్తాయి. విత్తన రకాల ఎంపిక చాలా కీలకం, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత విత్తన మొలక శాతం, పరీక్షించుకుంటే మంచిది. ఇక పత్తి విత్తనాలలో చాలా రకాలు ఉన్నందున నేలను బట్టి ఏఏ రకం ఎక్కువ దిగుబడి వస్తుందో చూసుకోవాలి.
రాయితీపై విత్తనాలు సిద్ధం
సూర్యాపేట సిటీ: ఉమ్మడి జిల్లాలోని రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా చేయనున్నారు. రైతుల కు అవసరమైన అన్ని రకాల విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎ్సఎ్సడీసీ) ఉమ్మడి జిల్లాలోని 37ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు, 68ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్),4 ఏఎ్ఫసీఎస్, 25 ఎంజీఎ్ససీఎస్, 5 డీసీఎంఎస్ కేంద్రాలకు పచ్చిరొట్ట, జనుము, జీలుగతోపాటు వరి విత్తనాలను సరఫరా చేసింది. నల్లగొండ జిల్లాలో 2,934. 46 క్వింటాళ్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 642.90 క్వింటాళ్లు, సూర్యాపేట జిల్లాలో 75.00 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే విత్తన కొనుగోలు కేంద్రాల నుంచి రైతులు విత్తనాలను విక్రయిస్తున్నారు. సబ్సిడీపై విత్తనాలను కొనుగోలు చేయడానికి ఈ నెల 30 చివరి తేదీగా తెలంగాణ సీడ్స్ రీజీనల్ అధికారులు తెలియజేస్తున్నారు. చివరితేదీలోపు విత్తనాలను రైతులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంస్థ ద్వారా రాయితీపై విత్తనాలను కొనుగోలు చేయడానికి అవకాశం లేదు.
భూసారం పెంచడంలో ఇవే కీలకం
సంప్రదాయ ఎరువులుగా ఉపయోగించే జీలుగ, పిల్లిపెసర, జనుము పంటలను వరి సాగుకు ముందు పొలంలో వేస్తే భూసారం పెరుగుతుం ది. నేల స్వభావాన్ని బట్టి ఆ పంటలను సాగు చేసుకోవడంవల్ల నేల క్షీణతను తగ్గించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పొలం వేసే నెలరోజుల ముందుగా జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను పొలం లో చట్టాలి. పొలం నాటు వేసే నాటికి పెరిగిన ఆ మొక్కలను పొలంలో నే కలియదున్నాలి. ఈ విధంగా చేయడంవల్ల గాలిలో ఉండే నత్రజని భూమిలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఈ పంటలు సహకరిస్తాయి. విత్తనాలు చల్లిన నాటి నుంచి 25 నుంచి 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరముంటుందని అధికారులు చెబుతున్నారు. ఏపుగా పెరిగిన మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించి, కలియదున్నాలి. అనంతరం సూపర్ పాస్పేట్ను దుక్కిలో వేయాలి. సూపర్ పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులుగా తయారవుతాయి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి : కృష్ణవేణి, తెలంగాణ విత్తన సంస్థ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ మేనేజర్.
భూసారాన్ని పెంచే సాంప్రదాయ ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పంటల పెరుగుద ల కోసం వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.
Updated Date - 2023-06-26T00:59:54+05:30 IST