విద్యార్థులు అస్వస్థతకు గురైనా మాకు చెప్పరా?
ABN, First Publish Date - 2023-06-26T03:25:38+05:30
తమ పిల్లలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైనా సమాచారమివ్వరా? అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటస్వామిని తల్లిదండ్రులు నిలదీశారు.....
మోత్కూర్ గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల ధర్నా
మోత్కూరు, జూన్ 25: తమ పిల్లలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైనా సమాచారమివ్వరా? అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటస్వామిని తల్లిదండ్రులు నిలదీశారు. కలుషిత ఆహారం తిని శుక్రవారం రాత్రి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు దినపత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన తల్లిదండ్రులు ఆదివారం పాఠశాలకు వచ్చారు. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలతో కలిసి పాఠశాల ఎదుట ధర్నా చేశారు. వంటశాలలోకి వెళ్లి పరిస్థితిని గమనించారు. ఆదివారం మెనూ ప్రకారం విద్యార్థులకు చికెన్ పెట్టాల్సి ఉండగా క్యాబేజీ కూర వండారు. మధ్యాహ్నం 12 గంటలకు టిఫిన్ పెడ్తున్నారని తెలిసి నిలదీశారు. విద్యార్థులతోచపాతీలు చేయిస్తున్న సిబ్బందిపై మండిపడ్డారు. ఈక్రమంలోనే విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, నాణ్యత లేని, అరకొర భోజనంతో సరిపెడుతున్నారన్నారు. కిటీలకు తలుపులు లేక వాన నీరు గదుల్లోకి వస్తోందని చెప్పారు. ముందురోజే ఆర్సీవో రజిని పాఠశాల సందర్శించి నిర్వాహకులు చెప్పి వెళ్లారని.. అయినా వారు పట్టించుకోవట్లేదని వివరించారు.
ఆర్సీవో హామీ ఇచ్చేవరకు..
ఈ నేపథ్యంలోనే ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి పాఠశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడికి చేరుకున్న ఆర్సీవో రజినిపై నాయకులు, తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ‘విద్యార్థులు అస్వస్థతకు గురైతే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వరా, మీకు వచ్చే కమీషన్లే తప్ప, విద్యార్థుల ఆరోగ్యం పట్టదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట కాంట్రాక్టర్ల కాంట్రాక్టు రద్దు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటస్వామిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని ఆర్సీవో చెప్పడంతో వారు శాంతించారు.
Updated Date - 2023-06-26T03:25:38+05:30 IST