ముగ్గుల ఫొటోలు తీస్తూ.. భవనమ్మీద నుంచి జారిపడి..
ABN, First Publish Date - 2023-01-15T02:56:06+05:30
అపార్ట్మెంట్ ప్రధాన గేటు వద్ద మహిళలంతా చేరి పరిచిన రంగు రంగుల ముగ్గులను చూసి ఆ బాలిక ముచ్చటపడింది.
14 ఏళ్ల బాలిక దుర్మరణం
ఏఎ్సరావునగర్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): అపార్ట్మెంట్ ప్రధాన గేటు వద్ద మహిళలంతా చేరి పరిచిన రంగు రంగుల ముగ్గులను చూసి ఆ బాలిక ముచ్చటపడింది. ఆ ముగ్గులను పై నుంచి ఫొటో తీస్తే బాగుంటుందని, ఐదో ఫ్లోర్కు వెళ్లింది. అక్కణ్నుంచి కిందికి చూస్తూ ఫొటో తీస్తుండగా పట్టుతప్పి నేరుగా కింద పడింది. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచింది. హైదరాబాద్ కుషాయిగూడ పరిఽధిలో ఈ విషాదం జరిగింది. మృతురాలు 14 ఏళ్ల కిన్నెర. అప్పటిదాకా తమతో ఎంతో ఉత్సాహంగా గడిపిన బాలికను ఆస్పత్రిలో తీవ్రగాయాల మధ్య విగతజీవిగా చూసి ఆ కన్నవారు కంటికీమంటికి ధారగా రోదించారు. కాప్రా సాధనా విహార్ కాలనీ ఆవాస్ అపార్టుమెంట్ బ్లాక్-బి, ఫ్లాట్ నెం 501(ఐదో అంతస్తు)లో నివాసం ఉండే కీర్తి, నాగర్కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు కిన్నెర(14) ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. భోగి సందర్భంగా శనివారం ఉదయం అపార్టుమెంట్ ప్రధాన గేటు ఎదుట మహిళలు రంగు రంగుల ముగ్గులు వేశారు. సదరు ముగ్గులను చూసి మురిసిపోయిన కిన్నెర అపార్టుమెంట్ ఐదో అంతస్తునుంచి తన సెల్ఫోన్లో ఫొటోలు తీసేందుకు యత్నించింది. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. తీవ్రగాయలపాలైన కిన్నెరను వెంటనే సైనిక్పురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిన్నెర మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-01-15T02:56:08+05:30 IST