మోదీ పాలనకు మిస్డ్ కాల్తో మద్దతివ్వండి
ABN, First Publish Date - 2023-06-01T00:52:53+05:30
ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మిస్డ్ కాల్తో మద్దతు తెలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనకు మిస్డ్ కాల్తో మద్దతు తెలపాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన మొబైల్ నెంబర్ 9090902024ను విడుదల చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గురువారం నుంచి జూన్ నెలాఖరు వరకు బీజేపీ తలపెట్టిన మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాల షెడ్యూల్నూ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో విడుదల చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ వెబ్సైటు, ప్రత్యేక గీతాన్నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసంపర్క్ అభియాన్లో భాగంగా జూన్ 1 నుంచి 7 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీడియా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. వికాస్ తీర్థ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను జాతీయ, స్థానిక నేతలు సందర్శించాలన్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ నేత/కేంద్ర మంత్రి హాజరవుతారని చెప్పారు. జూన్ 8-14 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సీనియర్ నేతలు, మేధావులతో సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మోర్చాల సంయుక్త సమ్మేళనాలు, జూన్ 15-21 వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 వేల మందికి తగ్గకుండా బహిరంగ సభలు నిర్వహించాల న్నా రు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న అన్ని మండలాల్లో ఘనంగా యోగా దివస్ నిర్వహించాలన్నారు. జూ న్ 22 నుంచి 28 వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలపైన విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జూన్ 23న పోలింగ్ బూత్ల వారీగా శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ కార్యక్రమాలు నిర్వహిచాలని, జూన్ 25న ప్రతి పోలింగ్ బూత్లో మన్కీ బాత్ నిర్వహించాలని ఆయన సూచించారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతోందని బండి సంజయ్ తెలిపారు. పీఎం ఆవాస్ కింద రాష్ట్రానికి 3.50 లక్షల ఇళ్లు కేటాయించిందని, జల్ జీవన్ కింద 54లక్షల మందికి నల్లా ల ద్వారా మంచి నీరందించిందని, 54 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2.96 లక్షల మందికి, పీఎం స్వనిధి ద్వారా 1.03 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. స్వచ్ఛభారత్ ద్వారా 30 లక్షల టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో మచ్చలేని, అవినీతి రహిత పాలన కొనసాగుతోందన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, వివక్షకు గురైన వారి జీవితాల్లో మార్పు కోసం రోజుకు 18 గంటలు ప్రధాని కష్టపడుతున్నారని కొనియాడారు.
అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాను
తాము ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బండి సంజయ్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన బీసీ మేధావుల సమావేశంలో మాట్లాడుతూ తాను కార్యకర్త స్థాయి నుంచి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని కాదన్నారు.
Updated Date - 2023-06-01T00:52:53+05:30 IST