నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
ABN, First Publish Date - 2023-03-02T00:53:23+05:30
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. భువనగిరిలోని యాదాద్రి జోన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బుధవారం నిర్వహించిన జోన్ క్రైం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్
భువనగిరి టౌన్, మార్చి 1: నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. భువనగిరిలోని యాదాద్రి జోన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బుధవారం నిర్వహించిన జోన్ క్రైం సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని, భూకబ్జాదారులు, రహదారులను దిగ్బంధించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. న్యాయంకోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు చేప్పే వివరాలను ఎస్హెచ్వోలు, పోలీస్ సిబ్బంది ఓపికగా వినాలని, వారితో మర్యాదగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు. పట్టణాల్లోని ప్రతీ బస్తీ, జిల్లాలోని ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, విధులను సక్రమంగా నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని, బ్రహ్మోత్సవాలు ముగిసే వరకూ బందోబస్తు కొనసాగుతుందన్నారు. జోన్ పరిధిలోని ప్రతీ పోలీస్ స్టేషన్వారీగా సమీక్షించి కేసుల వివరాలు, క్రైం రేటును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీ రాజేష్ చంద్ర, ఏసీపీలు ఎస్.వెంకట్రెడ్డి, కె.నర్సింహారెడ్డి, సైదులు, ఎన్.ఉదయ్రెడ్డి, జోన్ పరిధిలోని ఎస్హెచ్వోలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-02T00:53:23+05:30 IST