రైతుబంధు షురూ!
ABN, First Publish Date - 2023-06-26T22:53:23+05:30
వానాకాలం పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.
ప్రారంభమైన పెట్టుబడి పంపిణీ
ఆరోహణ క్రమంలో ఖాతాల్లో జమ
వికారాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వానాకాలం పంటలు సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు జిల్లాలో 74,236 మంది రైతుల ఖాతాలకు రూ.23.11 కోట్లు బదిలీ చేశారు. మొదటి రోజు ఎకరా విస్తీర్ణంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేశారు. మొదట తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులకు రైతు బంధు సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వానాకాలం పంటలు సాగు చేసేందుకు జిల్లాలో 2,88,834 మంది రైతులకు రూ.322,12,25,993 పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది వానాకాలంలో 2,70,232 మంది రైతులకు రూ.319.36 కోట్ల రైతుబంధు పంపిణీ చేయగా, ఈ ఏడాది గత ఏడాది కంటే 18,602 మంది రైతులకు ఎక్కువ సంఖ్యలో అందజేస్తున్నారు. ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఈ ఏడాది ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న 27,162 మంది కొత్త రైతులకు రైతుబంధు అందనుంది. పోడు రైతులకు ఈనెల 30వ తేదీ నుంచి ఆర్ఏఎ్ఫఆర్ హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న క్రమంలో కొత్తగా జిల్లాలో 436 మంది పోడు రైతులకు రైతుబంధు అందనుంది.
రైతుల ఖాతాలకు పెట్టుబడి బదిలీ
ఈ సీజన్లో జిల్లాలో 2,88,834 మంది రైతులకు రూ.322,12,25,993 పెట్టుబడి సాయం అందజేయనుండగా, ఇంత వరకు 1,89,254 మంది రైతులకు సంబంధించి రూ.131,42,17,213 రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ట్రెజరీకి పంపించారు. ఆరోహణ క్రమంలో పెరుగుతున్న విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ రైతుల ఖాతాలకు రైతుబంధు బదిలీ చేయనున్నారు. వివిధ కారణాలతో ఎవరైనా రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కాకపోతే వెంటనే సమస్య పరిష్కరించి వారికి రైతుబంధు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Updated Date - 2023-06-26T22:53:45+05:30 IST