ఆరుతడి పంటల సాగుతో లాభాలు
ABN, First Publish Date - 2023-04-20T23:29:18+05:30
రైతులు వరి సాగుకు బదులు ఆరుతడి పంటలైన కూరగాయలు, మల్బరీ, పండ్లతోటలపై దృష్టిసారిస్తే ఆర్థిక ఇబ్బందులు అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ అధికారులు ఏఎక్స్ మీనా, చిరాక్భట్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ అధికారులు
యాచారం, ఏప్రిల్ 20 : రైతులు వరి సాగుకు బదులు ఆరుతడి పంటలైన కూరగాయలు, మల్బరీ, పండ్లతోటలపై దృష్టిసారిస్తే ఆర్థిక ఇబ్బందులు అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ అధికారులు ఏఎక్స్ మీనా, చిరాక్భట్ పేర్కొన్నారు. గురువారం వారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి యాచారం మండలం చౌదర్పల్లి, నందివనపర్తి, మేడిపల్లి, గున్గల్ తదితర గ్రామాలలో కూరగాయ తోటలను పరిశీలించారు. అనంతరం సాగు వివరాలను, చీడపీడల నివారణ, నారు ఎగుమతి, కూరగాయల విక్రయం, సాగు వ్యయం తదితర వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాచారంలో కూరగాయల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైబ్రీడ్ రకం విత్తనాలు అందించాలని కోరారు. డ్రిప్ పద్ధతిన కూరగాయలు సాగు చేసుకోవాలని, మల్చింగ్ విధానంతో కలుపు తక్కువగా ఉంటుందని అధికారులు రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాననన శాఖ పీడీ డాక్టర్ సునంద, డిప్యూటీ డైరెక్టర్లు వేణుగోపాల్, సంజయ్ కుమార్, సర్పంచ్లు ఉదయశ్రీ, ఎన్.నర్సింహారెడ్డి, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కనకలక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్ కె.జోగిరెడ్డి తదితరులున్నారు.
Updated Date - 2023-04-20T23:29:18+05:30 IST