డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ఊరుకోం
ABN, First Publish Date - 2023-04-16T23:30:50+05:30
జంటనగరాల నుంచి తెచ్చే చెత్త నిల్వ కోసం యాచారం మండల పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే ఊరుకోమని, తాము ఆందోళనలు చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి హెచ్చరించారు.
జాతీయ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
యాచారం, ఏప్రిల్ 16 : జంటనగరాల నుంచి తెచ్చే చెత్త నిల్వ కోసం యాచారం మండల పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుచేస్తే ఊరుకోమని, తాము ఆందోళనలు చేస్తామని కిసాన్సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి హెచ్చరించారు. ఆదివారం యాచారంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్కంట్రోల్ బోర్డుకు నగర పాలక సంస్థ తప్పుడు సమాచారమందించి దొడ్డిదారిన డంపింగ్ యార్డు ఏర్పాటుకు అనుమతి పొందిందని ఆరోపించారు. నగరానికి చేరువలో ఉన్న యాచారంలో చెత్తతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. మైనింగ్జోన్, ఫార్మాసిటీ, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు పాలకులు పూనుకోవడం మంచిది కాదన్నారు. యాచారం మండలం అభివృద్ధి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాచారంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యంతో 12 నుంచి 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పారు. తాము దీనిని సహించేది లేదని కోదండరెడ్డి చెప్పారు.
Updated Date - 2023-04-16T23:30:50+05:30 IST