వేసవిలో తాగునీటి ఇబ్బందులు రావొద్దు
ABN, First Publish Date - 2023-02-21T23:17:08+05:30
వేసవిలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలగొద్దు
పీఆర్ పనుల్లో వేగం పెంచాలి
పీహెచ్సీల్లో వైద్య సేవలు మెరుగుపడాలి
సమీక్షలో అధికారులకు జడ్పీ చైర్పర్సన్ ఆదేశం
వికారాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : వేసవిలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలో మిషన్ భగీరథ, వైద్యఆరోగ్యం, పంచాయతీరాజ్శాఖల పనితీరుపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం శాశ్వత తాగునీటి ఎద్దడి నివారణ కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా చేస్తోందన్నారు. అనివార్య కారణాలతో ఎక్కడైనా తాగునీటి సరఫరా నిలిచిపోతే అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పశువులు దాహార్తితో అల్లాడిపోకుండా నీటితొట్లు ఎప్పుడూ నింపి ఉంచాలని సూచించారు. జిల్లా పరిషత్తు నిధులతో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ఆమె ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని డీఎంహెచ్వోకు సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో స్నేక్బైట్, డాగ్ బైక్ నిరోధక ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ పీహెచ్సీలో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, మిషన్ భగీరథ ఈఈ బాబూ శ్రీనివాస్, డాక్టర్ పల్వన్కుమార్, పీఆర్ఈఈ శ్రీనివా్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
బొంరాస్పేట్ : తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులు దృష్ఠికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో మంగళవారం ఖాళీ బిందెలతో బొంరాస్పేటలో సర్పంచ్ జయమ్మ ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ముదిరాజ్ కాలనీలకు ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీరు సరఫరా లేదన్నారు. బోర్లకు మరమ్మతులు చేసినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చేయడం లేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.
Updated Date - 2023-02-21T23:17:09+05:30 IST