Grihalakshmi : ‘గృహలక్ష్మి’కి 3 రోజులే గడువు!
ABN, First Publish Date - 2023-08-08T03:01:20+05:30
గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు ప్రభుత్వం మూడే మూడు రోజులు గడువు ఇచ్చింది. అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ (గురువారం)లోగా దరఖాస్తు చేసుకోవాలని డెడ్లైన్ విధించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలివ్వగా... సాయంత్రం పలు కలెక్టరేట్లు గడువు,
10లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారుల ప్రకటన..
దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
25 నాటికి ఇండ్ల మంజూరు... కలెక్టర్లతో వీసీలో సీఎస్
సంబంధిత మంత్రి, శాఖాధికారుల నుంచి ప్రకటన లేదు
3 రోజుల్లో దరఖాస్తులు ఎలా అంటున్న ఆశావహులు
దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు
అందుబాటులో లేని వీఆర్వోలు.. కొన్నిచోట్ల తహసీల్లార్లూ!
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గృహలక్ష్మి పథకం దరఖాస్తులకు ప్రభుత్వం మూడే మూడు రోజులు గడువు ఇచ్చింది. అర్హులైన వారు ఈ నెల 10వ తేదీ (గురువారం)లోగా దరఖాస్తు చేసుకోవాలని డెడ్లైన్ విధించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలివ్వగా... సాయంత్రం పలు కలెక్టరేట్లు గడువు, ఇతర వివరాలతో ప్రకటనలు జారీ చేశాయి. దరఖాస్తుతో పాటు స్థలం రిజిస్ట్రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, ఆహార భద్రతా కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు జత చేయాలని ప్రకటనల్లో తెలిపారు. గ్రామాల్లో డప్పు చాటింపుతో ప్రజలకు సమాచారం చేరవేయాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ మాట్లాడుతూ తహశీల్దార్, మునిసిపల్, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులతో పాటు ఈ నెల 10 వరకు వచ్చే దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను 20వ తేదీ వరకు పూర్తిచేసి, జిల్లా ఇన్చార్జి మంత్రితో ఆమోదం పొందిన లబ్ధిదారులకు 25వ తేదీ నాటికి పథకం మంజూరు చేయాలని సూచించారంటూ వరంగల్ కలెక్టరేట్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు ఫారాలు ఎక్కడ దొరుకుతాయో మాత్రం అధికారులు తెలుపలేదు. గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు ఫారమ్ ఇదేనంటూ ఓ ఫారాన్ని అధికార పార్టీకి చెందిన పలువురు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దరఖాస్తుల అంశంపై సంబంధిత శాఖ మంత్రితో పాటు, శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా?
రాష్ట్ర ప్రభుత్వ తీరు పేదలను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్నట్టుంది. ఇందుకు తాజాగా గృహలక్ష్మి దరఖాస్తుల గడువే నిదర్శనమని, లక్షల మంది పేదలతో ముడిపడి ఉన్న ఈ పథకానికి కేవలం మూడే రోజులు సమయం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత స్థలం ఉండి, ఇలు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మిలో రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేండ్లగా ఊరిస్తూ వచ్చి మూడు రోజులే గడువు ఇవ్వడమే కాకుండా దరఖాస్తుకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు జత చేయాలని షరతు విధించింది. వీటిని మీ-సేవ ద్వారా తీసుకోవాల్సి ఉండడంతో కనీసం వారం రోజులు పడుతుంది. దీంతో మూడు రోజుల్లో దరఖాస్తు ఎలా చేసుకోగలమని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ పత్రాలకు వీఆర్ఏ, వీఆర్వోల పరిశీలన ఉంటుంది. కానీ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను పక్కనపెట్టడంతో పాటు వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి పంపింది. దీంతో ఆశావహులు అయోమయంలో ఉన్నారు. సంక్షేమ పథకాల అమలు, దరఖాస్తుల వ్యవహారంలో సర్కారు అవలంబిస్తున్న విధానం ఆశావహులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల బీసీలకు రూ.లక్ష సాయం పథకం కోసం కూడా దరఖాస్తులకు కేవలం 16 రోజులే గడువు ఇచ్చింది. దీంతో ధృవీకరణ పత్రాలు చాలామందికి అందలేదు. కాగా, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తహశీల్దార్లు కూడా బదిలీ అయ్యారు. కొంతమంది బదిలీ అయిన ప్రాంతానికి ఇంకా వెళ్లలేదు. దీంతో అవసరమైన పత్రాలు అందకపోతే లబ్ధి పొందలేమని ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. గడువు విషయంలో ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరుతున్నారు.
సాయం.. మూడు దఫాలుగా...
గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు జూన్ 21న జారీ చేసింది. చెప్పినట్టు వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురాలేదు. కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఇంటికి అందించే రూ.3 లక్షల సాయాన్ని మూడు దఫాలుగా (బేస్మెంట్ లెవెల్, స్లాబ్ లెవల్, నిర్మాణం పూర్తయిన తర్వాత) అందించనన్నారు. దీనికి లబ్ధిదారు పేరుతో బ్యాంకులో ప్రత్యేక అకౌంటు తీయాలి. జనధన్ ఖాతాలు ఈ పథకానికి ఉపయోగపడవు. కుటుంబంలో మహిళ పేరు మీద ఇల్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆర్సీసీ స్లాబ్ ఇల్లు లేని వారు, జీవో నెం.59 (మార్కెట్ ధరపై ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ) ద్వారా లబ్ధి పొందని వారు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంటి నిర్మాణం కోసం ఉన్న స్థలం లేదా ప్లాటు పత్రాలున్న వారు అర్హులని వరంగల్ కలెక్టర్ ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. జీవో నెం.59 ద్వారా లబ్ధి పొందలేదని, ఆర్సీసీ స్లాబ్ ఇల్లు లేదని డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు.
Updated Date - 2023-08-08T03:01:20+05:30 IST